వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో అయిదు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగన నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (71*; 25 బంతుల్లో, 3x4, 7x6) గొప్పగా పోరాడాడు.
అయితే ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్లో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. జట్టులో స్పూర్తి రగిలించేలా పాంటింగ్ మాట్లాడాడు. ఈ సీజన్లో తమకు ఇంకా అవకాశాలు ఉన్నాయని, ముంబైపై గొప్పగా పోరాడమని అన్నాడు. 14 మ్యాచ్ల్లో ఇంకా తొమ్మిది మ్యాచ్లు ఉన్నాయని, ఓటమిని మరిచి తర్వాత మ్యాచ్పై దృష్టిసారించాలని అన్నాడు.

''ఇప్పుడు మనకు ఐపీఎల్ 9 మ్యాచ్ల టోర్నమెంట్ మాత్రమే. ఈ తొమ్మిదింట్లో మనం ఎనిమిది విజయాలు సాధించాలి. సాధ్యమైనంతగా గొప్పగా ప్రయత్నిద్దాం. కలిసికట్టుగా ఉందాం. ముంబై మ్యాచ్లో తల ఎత్తుకొనే ప్రదర్శనే చేశాం. అవును, మనం 29 పరుగులతో ఓడాం. కానీ దాదాపు 210 పరుగులు చేశాం. అది కూడా ఛేదనలో. వాంఖడేలో సగటు స్కోరు 175 అని మ్యాచ్కు ముందే చెప్పాను. కాబట్టి మనం ఎంతో గొప్పగా ప్రయత్నించాం. ఈ సమయంలోనే పుంజుకుని సత్తాచాటాలి. మ్యాచ్ ముగిసింది, ఫలితం తేలింది. ఇక వచ్చే మ్యాచ్పైనే మన ఫోకస్'' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి పోరులో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 12న లక్నో వేదికగా జరగనుంది. కాగా, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ గ్రౌండ్గా వైజాగ్లో రెండు మ్యాచ్లు ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. కానీ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓటమిపాలైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం.. ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి సమయం పట్టనుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ను తాత్కాలికంగా సొంతమైదానంగా ఎంచుకుంది.