ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు దాదాపు నిష్క్రమించినట్లే. కానీ టెక్నికల్గా ఆ జట్టుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి.
అయితే జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ విజయాలు సాధించకపోవడానికి గల కారణాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ వివరించాడు. వేలంలో ప్రదర్శించిన పేలవ వ్యూహాలే బెంగళూరు పతనానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. అంతేగాక ఆటగాళ్లను తమకు సౌకర్యంగా ఉన్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో బ్యాటింగ్కు పంపించడం వైఫల్యానికి మరో కారణమని తెలిపాడు. అలాగే ఈ సీజన్లో మాక్స్వెల్ ఫామ్ కోల్పోవడం ఆ జట్టును మరింత దెబ్బతీసిందని ఫించ్ చెప్పాడు.

''ఆర్సీబీ సత్తాచాటలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వేలంలో తీసుకున్న నిర్ణయం ఓ కారణం. బ్యాటింగ్ గ్రూప్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టి, బౌలింగ్ కోసం ఎక్కువ మొత్తాన్ని ఉంచలేకపోయారు. అంతేగాక వరల్డ్ క్లాస్ స్పిన్నర్ జట్టులో లేకపోవడం ప్రతికూలాంశం. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇది రుజువైంది. సునీల్ నరైన్ వరల్డ్ క్లాస్ ఆపరేటర్. ప్రతి మ్యాచ్లో అతను సత్తాచాటే బౌలర్. ఆర్సీబీ జట్టులో నిలకడగా ప్రదర్శన చేసే స్పిన్నర్ లేడు''
''కొన్నిసందర్భాల్లో ఆటగాళ్లను పంపించే స్థానాలు వైఫల్యానికి ఓ కారణం. తమకు అలవాటులేని స్థానాల్లో బ్యాటింగ్కు పంపిస్తారు. కామెరూన్ గ్రీన్ కోసం భారీ ధర వెచ్చించి ట్రేడ్ చేసుకున్నారు. ఫ్రాంచైజీ దగ్గర ఉన్న డబ్బులో అతని కోసమే అధిక వాటా ఖర్చు పెట్టి తాను సౌకర్యంగా లేని స్థానంలో బ్యాటింగ్ పంపించడం చెత్త వ్యూహం. అంతేగాక మాక్స్వెల్ ఫామ్లో లేకపోవడం ఆర్సీబీ దారుణంగా బాధిస్తుంది. ఇంపాక్ట్ ఇన్నింగ్స్లు ఆడే మ్యాచ్ విన్నర్ మాక్సీ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయాడు'' అని ఫించ్ పేర్కొన్నాడు. కాగా, రేపు ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.