లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు.

లక్నోపై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానానికి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆరు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్పై గెలిచింది. మిగిలిన మ్యాచ్ల్లో ఓటమిపాలై -1.124 రన్రేటుతో పదో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ మొదలైంది.
అయితే 2009, 2011 సీజన్లోనూ ఆర్సీబీది దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్స్కు కూడా చేరింది. ఈ సీజన్లోనూ బెంగళూరు అదే తరహాలో కొనసాగితే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంటాయి. కానీ మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు విజయాలు సాధించాలి. అంతేగాక ఇతర జట్ల ఫలితంపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
తర్వాతి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్లతో రెండు మ్యాచ్లు, కేకేఆర్, పంజాబ్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కేలతో తలో మ్యాచ్ ఆర్సీబీ ఆడనుంది. ఫామ్లో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్లను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేదే అసలు ప్రశ్న. బౌలర్లు చెలరేగితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరగలదు. కాగా, సొంతమైదానంలో సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తలపడనుంది.