RCB vs SRH: సన్రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయమైన మ్యాచ్ ఆడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. ఐపీఎల్ ఒక్కటే కాదు.. మొత్తం టీ20 మ్యాచ్ల చరిత్రలోనే తనకంటూ ఓ పేజీని సృష్టించుకోగలిగింది.
సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీని 25 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లల్లో నాలుగింట్లో ఘన విజయాలను సాధించింది. చివరి మూడు మ్యాచ్లల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ తోడు కావడంతో చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ కనిపించింది.అనంతరం ఛేజింగ్కు దిగిన ఆర్సీబీ అద్భుతంగా పోరాడింది.
ప్రారంభ, చివరి ఓవర్లల్లో విజృంభించి ఆడారు బ్యాటర్లు. మిడిలార్డర్ విఫలం కావడం, మిడిల్ ఓవర్లల్లో భారీ భాగస్వామ్యం ఏర్పడకపోవడం వారి పరాజయానికి దారి తీసింది. లోయర్ ఆర్డర్లో నిలకడగా రాణిస్తోన్న దినేష్ కార్తీక్ 35 బంతుల్లో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ కొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టింది. వాటిని తన పేరు మీద లిఖించుకుంది. ఐపీఎల్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టు ఇదే. 287 పరుగుల స్కోర్ను ఇప్పటివరకూ ఏ జట్టు కూడా చేయలేదు. ఈ క్రమంలో తానే సృష్టించిన 277 పరుగుల అత్యధిక స్కోర్ను కూడా తుడిచి పెట్టేసిం. దానికి ఓ 10 పరుగులు అదనంగా జోడించింది.
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఇన్నింగ్లో 22 సిక్సర్లు నమోదయ్యాయి. ఏ ఐపీఎల్ మ్యాచ్ను తీసుకున్నా గానీ ఒక ఇన్నింగ్లో ఇన్నేసి సిక్సర్లు ఇప్పటివరకు నమోదు కాలేదు. ఒక ఐపీఎల్ సీజన్లో 250 పరుగులను దాటిన ఏకైక జట్టు ఇదొక్కటే. తొలిసారిగా రెండుసార్లు 250ని దాటిందీ టీమ్. అలాగే రెండుసార్లు 270కి పైగా పరుగులు చేసిన తొలి టీమ్ కూడా సన్రైజర్సే. కోల్కత నైట్ రైడర్స్ మాత్రమే ఒక్కసారి 270ని క్రాస్ చేసింది.