Travis Head: సన్రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయమైన మ్యాచ్ ఆడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీని 25 పరుగుల తేడాతో ఓడించింది.
ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లల్లో నాలుగింట్లో ఘన విజయాలను సాధించింది. చివరి మూడు మ్యాచ్లల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హెడ్.. స్టేడియంలో సునామీని సృష్టించాడు. 41 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 102 పరుగులు చేశాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్పైనా విరుచుకుపడ్డాడు హెడ్. ఆ మ్యాచ్లో 39 బంతుల్లో మూడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు బాదాడు. సన్రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసింది ఆ మ్యాచ్లోనే.
ఈ సీజన్లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్లను ఆడిన ట్రావిస్ హెడ్.. 235 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 102. 47.0 బ్యాటింగ్ యావరేజ్ను నమోదు చేశాడీ డాషింగ్ ఓపెనర్. 199.15 స్ట్రైక్ రేట్తో స్కోర్ బోర్డును ఉరుకులు పరుగులు పెట్టిస్తోన్నాడు.
ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ విన్యాసాలపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియా అనే పేరు హెడ్కు నచ్చట్లేదని, ఆ పేరు కనిపిస్తే చాలు విజృంభించి ఆడుతుంటాడని వ్యాఖ్యానించారు. గత ఏడాది టీమిండియాపైనే జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ మ్యాచ్ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్లో అతను సెంచరీ విషయం తెలిసిందే.
తీరా ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్పై చెలరేగి ఆడాడని చెప్పాడు. ఇందులో కూడా ఇండియా అనే పేరు ఉందని గుర్తు చేశాడు. ఈ విషయంలో తన అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించాడు ఆకాష్ చోప్రా. బెంగళూరు అనే పేరుపైనా కసిదీరా ఆడాడని పేర్కొన్నాడు. ఇండియా అనే పేరు లేని జట్టుపై అతను ఈ స్థాయిలో చెలరేగడం ఇదే తొలిసారిగా అభివర్ణించాడు.