SRH vs RCB: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్పై జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడింది. 287 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో చివరి బంతి వరకూ పోరాడింది గానీ అది సరిపోలేదు. 262 పరుగుల వద్ద దాని ప్రస్థానం ఆగిపోయింది.
ఆర్సీబీకి ఇది వరుసగా అయిదో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 10. ఇక తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 21వ తేదీన ఆడబోతోంది. కోల్కత నైట్ రైడర్స్ను ఢీ కొట్టబోతోంది. కోల్కత ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.

సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది సన్రైజర్స్. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ తోడు కావడంతో చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ ఏర్పడింది.
అనంతరం ఛేజింగ్కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ప్రారంభ, చివరి ఓవర్లల్లో విజృంభించి ఆడారు గానీ ఎక్కువ సేపు క్రీజ్లో నిల్చోలేకపోయారు. మిడిలార్డర్ విఫలం కావడం, మిడిల్ ఓవర్లల్లో భారీ భాగస్వామ్యం ఏర్పడకపోవడం వారి పరాజయానికి దారి తీసింది. లోయర్ ఆర్డర్లో నిలకడగా రాణిస్తోన్న దినేష్ కార్తీక్ 35 బంతుల్లో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 83 పరుగులు చేసి, చివరి వరకు జట్టును గెలిపించడానికి కృషి చేశాడు.
ఈ ఓటమి తరువాత రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం అయినట్టే. ఇంకా ఏడు మ్యాచ్లు ఆర్సీబీ చేతిలో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్తో రెండు, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. కనీసం అయిదింట్లో భారీ రన్రేట్తో గెలిస్తే గానీ ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండవు.
ఇలా అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఆర్సీబీపై కర్ణాటకకే చెందిన భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశు గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆటతీరుతో ఐపీఎల్ సీజన్లో చివరి వరకూ నిలవలేదంటూ ఫైర్ అయ్యాడు.
ఆర్సీబీని కొత్త ఓనర్లకు అమ్మేయాలని బీసీసీఐకి సూచించాడు మహేష్ భూపతి. స్పోర్ట్స్, ఐపీఎల్, క్రీడాభిమానుల కోసం బీసీసీఐ తక్షణమే ఈ ఫ్రాంఛైజీని కొత్త వారికి విక్రయించాలని అన్నాడు. అప్పుడైనా కొత్త మేనేజ్మెంట్ జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై శ్రద్ధ చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడుతున్న మిగిలిన జట్లలాగా పోటీతత్వంతో ఆడేలా తయారు చేయగలుగుతుందని పేర్కొన్నాడు.