Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘన విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేసింది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి వైదొలగిపోవడం ఖాయం అనుకున్న దశలో జూలు విదిలించింది ఆర్సీబీ. వరుసగా నాలుగు మ్యాచ్లల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.
గురువారం రాత్రి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో పంజాబ్ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్కు దిగిన ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం ప్రత్యర్థి జట్టును 181 పరుగుల వద్దే ఆలౌట్ చేసింది.

ఐపీఎల్ టోర్నమెంట్ దాదాపుగా ముగింపుదశలో ఉన్నప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది ఆర్సీబీ. వరుసగా నాలుగు మ్యాచ్లను గెలవడం అంటే మాటలు కాదు. 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇంకా రెండు మ్యాచ్లో ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ రెండింటినీ భారీ నెట్ రన్రేట్తో గెలవగలిగితే మొత్తం 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్లో ఓటమితో పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొట్టయింది. మొత్తం ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడింది పంజాబ్ కింగ్స్. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా రెండు చొప్పున మ్యాచ్లను ఆడాల్సి ఉంది. అందులో గెలిచినా పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే జట్టు కేప్టెన్ శామ్ కుర్రన్ ముందే.. ఓటమిని అంగీకరించాడు.
కాగా- ధర్మశాల మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా విరాట్ కోహ్లీ.. పంజాబ్ కింగ్స్ జట్టు ఫ్రాంఛైజీ ఓనర్ ప్రీతి జింతా చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలో అతను ప్రీతి జింతాకు సారీ చెప్పాడు.
ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి, టోర్నమెంట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారకుడు విరాట్ కోహ్లీ. బ్యాటింగ్, ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించాడు. 47 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 92 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మిడిలార్డర్లో రజత్ పటిదార్, కామెరాన్ గ్రీన్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోర్ కార్డ్ 240ని దాటింది.