రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. సొంతమైదానంలో మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు లక్నో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (81; 56 బంతుల్లో, 8×4, 5×6), నికోలస్ పూరన్ (40*; 21 బంతుల్లో, 1×4, 5×6) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్ లోమ్రర్ (33; 13 బంతుల్లో, 3×4, 3×6), రజత్ పటిదార్ (29; 21 బంతుల్లో, 2×4, 2×6) పోరాడారు. మయాంక్ యాదవ్ (3/14), నవీనుల్ హక్ (2/25) సత్తాచాటారు. కాగా, మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ విజయానికి, ఆర్సీబీ ఓటమికి కారణాలు వివరించాడు. టాస్ ఓడిపోవడమం తమకు మంచిదైందని, గెలిచి ఉంటే బౌలింగ్ తీసుకునేవాడినని రాహుల్ అన్నాడు. తమ బౌలర్లు, బ్యాటర్లు సత్తాచాటారని తెలిపాడు.

''ఓవరాల్గా మంచి ప్రదర్శన చేశాం. వికెట్ కాస్త గమ్మత్తుగా ఉంది. సీమర్లకు కాస్త సహకరిస్తుంది. మేం బ్యాటింగ్లో శుభారంభాన్ని అందుకున్నాం. డికాక్ మంచి ఆరంభాన్ని అందించాడు. ప్రత్యర్థి బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ను కనుగొనేలోపు మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. మేం కోరుకున్న దాని కంటే 10-15 పరుగులు అదనంగా సాధించాం. అది మాకు ఎంతో కలిసొచ్చింది. బౌలర్లకు ఒకే విషయం చెప్పాం. పిచ్ కాస్త సహకరిస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి, యార్కర్లు ఎక్కువగా వద్దని అన్నాం''
''ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో ఓ ఓవర్లో రెండు ఫోర్లు లేదా సిక్సర్లు వస్తే బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే ప్రశాంతతతో బౌలింగ్ చేయాలనుకున్నాం. మయాంక్ యాదవ్ బౌలింగ్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది. అతడు గత రెండు సీజన్లలో ఓపికగా డగౌట్లో ఎదురుచూశాడు. గత సీజన్లో దురదృష్టవశాత్తు గాయంతో దూరమయ్యాడు. ముంబైలో ఫిజియోల పర్యవేక్షణలో ఎంతో కష్టపడ్డాడు. యుక్త వయసులో 150 కి.మీ/గంట వేగంతో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. అంతేగాక అతడికి కొన్ని గాయాలయ్యాయి. కానీ అతడు తన శరీరంపై ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు''
''మయాంక్ యాదవ్కు గొప్ప టెంపర్మెంట్ ఉంది. స్టంప్స్ వెనుక ఉండి తన బౌలింగ్ చూడటాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. ఇక, టాస్ గెలిస్తే నాకు బౌలింగ్ తీసుకోవాలనిపిస్తుంది. టీ20 క్రికెట్లో సాధారణంగా అదే ట్రెండ్. అయితే ఇవాళ టాస్ ఓడిపోవడం మాకు మంచిదైంది. గత రెండు సీజన్లలో పవర్ప్లే బౌలింగ్ మాకు ప్రశ్నగా మిగిలింది. దానికి సమాధానం వెతుకుతున్నాం. ఇవాళ పవర్ప్లేలో స్పిన్ను ప్రయోగించాం. ఆర్సీబీ మ్యాచ్లో ఇది పనిచేసింది'' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.