Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్లే ఉన్నాయి. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్- 8, రజత్ పటిదార్- 3, అనూజ్ రావత్- 3 విఫలం అయ్యారు. కామెరాన్ గ్రీన్- 33, మ్యాక్స్వెల్- 28 ఫర్వాలేదనిపించారు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ విరాట్ కోహ్లీ ఒక్కడే క్రీజ్లో నిలవగలిగాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. చివర్లో క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న డీకే మూడు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు.
ఇంత భారీ స్కోర్ను ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కొట్టి అవతలపడేసింది కోల్కత నైట్ రైడర్స్ టీమ్. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్- 30, సునీల్ నరైన్: 47, వెంకటేష్ అయ్యర్- 50 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 47, రింకూ సింగ్- 5 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు సరదాగా కలిసిపోయారు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్స్ సమయంలో పలకరించుకున్నారు. ఆండ్రీ రస్సెల్స్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మాట్లాడుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ టిప్స్ ఇచ్చారు.
ఆ సమయంలో రింకూ సింగ్ బ్యాట్ను విరాట్ కోహ్లీ చెక్ చేయడం కనిపించింది. ఆ సమయంలో కోహ్లీ వేసిన జోక్కు రింకూ గట్టిగా నవ్వాడు. పించ్ హిట్టర్గా పేరుంది రింకూ సింగ్కు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతుంటాడు. ఆ దూకుడు కారణంతోనే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకోగలిగాడు. ఈ మ్యాచ్లో అయిదు పరుగులతో నాటౌట్గా నిలిచాడు.