Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్లే ఉన్నాయి. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కత నైట్రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కేకేఆర్ దాన్ని కొట్టి అవతలపడేసింది.

ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటిదార్, అనూజ్ రావత్.. వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు టీమ్లో ఉన్నప్పటికీ- బరువు మాత్రం విరాట్ కోహ్లీనే మోశాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. నాటౌట్గా నిలిచాడు. గ్రీన్, మ్యాక్సీ మినహా మరెవరూ కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. చివర్లో క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ.
ఇదే విషయాన్ని ప్రస్తావించాడు టీమిండియా లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్. విరాట్ కోహ్లీకి సపోర్టివ్గా మాట్లాడాడు. అతనిపై సానుభూతిని చూపాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో విరాట్ కోహ్లీకి ఎవ్వరూ అండగా లేరని.. అలా జరిగివుంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ ఒక్కడే ఎంత వరకు బరువు మోయగలడని ప్రశ్నించాడు గవాస్కర్. ప్రతి మ్యాచ్లోనూ అతనే ఆడాలని ఆర్సీబీ మిగితా ప్లేయర్లు కోరుకుంటోన్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నాడు. జట్టు భారీ స్కోర్ చేయాలంటే అదే స్థాయిలో భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నాడు.
క్రీజ్లో ఎవరో ఒకరు కోహ్లీ అండగా నిలిచివుంటే ఆర్సీబీ స్కోర్ మరింత పెరిగివుండేదని, కోహ్లీ సెంచరీ చేసి ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. మరో ఎండ్లో కోహ్లీకి మంచి సపోర్ట్ లభించివుంటే అతను 83 పరుగుల వద్దే నిలిచేవాడు కాదని, 120 పరుగులు చేసేవాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.