Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైఫ్ అండ్ డెత్ గేమ్ను ఆడబోతోంది. తన హోమ్ పిచ్పై గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కొనబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్లో గెలిస్తేనే అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గానీ, గుజరాత్ టైటాన్స్ గానీ ప్లేఆఫ్స్ రేసులో నిలవగలుగుతాయి. ఏ జట్టు ఓడిపోయినా ఇబ్బందులను ఎదుర్కొన తప్పదు. ప్రత్యేకించి- ఆర్సీబీకి అత్యంత కీలకమైన గేమ్ ఇది. ఇందులో ఓడిపోతే మాత్రం ముంబై ఇండియన్స్ తరహాలో ఇంటిదారి పట్టక తప్పదు.

ఇప్పటివరకు 10 మ్యాచ్లను ఆడాయి ఈ రెండు జట్లు. ఆర్సీబీ గెలిచింది మూడింట్లోనే. ఏడు మ్యాచ్లల్లో ఓడింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉందీ టీమ్. ఇందులో గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలను కొంత వరకు సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్లల్లో గెలిస్తే నాకౌట్స్కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్లో భారీ స్కోర్తో గెలవాలీ అంటే ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటిదార్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ బ్యాటింగ్లో చెలరేగాల్సి ఉంటుంది. భారీ స్కోర్ చేయగలిగితే గానీ గుజరాత్ టైటాన్స్ గండాన్ని గట్టెక్కడం దాదాపుగా అసాధ్యమౌతుంది.
గుజరాత్ టైటాన్స్పై విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు గుజరాత్పై నాలుగు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 302 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 151 బ్యాటింగ్ యావరేజ్. 142 స్ట్రైక్ రేట్ను అందుకున్నాడు కోహ్లీ. అదే దూకుడుతో ఆడాడంటే ఆర్సీబీ గండం గట్టెక్కినట్టే.
అదే సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 3,000 ఐపీఎల్ పరుగులకు చాలా దగ్గరగా ఉన్నాడు కోహ్లీ. ఇంకో 76 పరుగుల చేయగలిగితే ఈ రికార్డును అందుకోగలుగుతాడు. ఒకే స్టేడియంలో ఇన్నేసి పరుగులు చేసిన ప్లేయర్ మరొకరు లేరు.