రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్కు గుడ్బై పలకనున్నాడు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్తో తన లీగ్ ప్రయాణాన్ని ముగియనున్నాడని సమాచారం. 2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి లీగ్లో కొనసాగుతున్న కార్తిక్ గత 16 సీజన్లలోనూ ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే కార్తిక్ బరిలోకి దిగలేదు. మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఈ వికెట్కీపర్ ఆడటం విశేషం.
ఢిల్లీ డేర్డెవిల్స్తో తన ఐపీఎల్ కెరీర్ను ఆరంభించిన దినేశ్ కార్తిక్ ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీతో పాటు పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ తరఫున ఆడాడు. 2015లో బెంగళూరుకు ఆడిన కార్తిక్ తిరిగి 2022లో అదే ఫ్రాంచైజీ గూటికి చేరుకున్నాడు. మొత్తంగా 240 మ్యాచ్లు ఆడిన డీకే 4516 పరుగులు చేశాడు. 50 అర్ధశతకాలు బాదాడు. అత్యధిక మందిని ఔట్ చేసిన రెండో వికెట్కీపర్గా ధోనీ తర్వాతి స్థానంలో కార్తిక్ నిలిచాడు. తన గ్లవ్స్ వర్క్తో 133 మందిని పెవిలియన్కు చేర్చాడు.

38 ఏళ్ల దినేశ్ కార్తిక్ గత ఐపీఎల్ సీజన్లో నిరాశపరిచాడు. 11 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే సాధించాడు. కానీ 2022 సీజన్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 55 సగటుతో 330 పరుగులు చేశాడు. ఫినిషర్గా చెలరేగి టీమిండియాలో తిరిగి చోటు కూడా సంపాదించాడు. 2022 టీ20 ప్రపంచకప్లో ఆడాడు. కానీ ఆ మెగాటోర్నీలో మూడు ఇన్నింగ్స్ల్లో 14 పరుగులే చేశాడు.
అయితే దినేశ్ కార్తిక్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తన క్రికెట్ నాలెడ్జ్ను కామెంటరీ రూపంలో పంచుకుంటున్నాడు. ప్రస్తుత భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లోనూ డీకే వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. మరి, తన ఐపీఎల్ ఆఖరి సీజన్లో ట్రోఫీని ముద్దాడి ఆర్సీబీ కప్ కలను నెరవేరుస్తాడేమో చూడాలి.