రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో గెలుపు. వరుసగా నాలుగో మ్యాచ్లో విజయం సాధించింది. సొంతమైదానంలో జైపుర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు.
అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో టోప్లే రెండు, సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.

అయితే ఛేజింగ్లో రాజస్థాన్కు ఆదిలోనే షాక్ ఎదురైంది. ఖాతా తెరవకముందే యశస్వీ జైస్వాల్ను టోప్లే పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 5 ఓవర్లకు ఆర్ఆర్ 34 పరుగులే చేసింది. కానీ ఆరో ఓవర్ వేసిన మయాంక్ దగార్ 20 పరుగులు సమర్పించుకున్నాడు. బట్లర్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.
అనంతరం ఛేదన రాజస్థాన్ కంట్రోల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో శాంసన్, బట్లర్ అర్ధశతకాలు సాధించారు. 14 ఓవర్లకు 145 పరుగులతో ఆర్ఆర్ విజయానికి వేగంగా దూసుకెళ్లింది. కాగా, ఆర్సీబీ బౌలర్లు పుంజుకుని శాంసన్, రియాన్ పరాగ్ (4; 4 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (2; 3 బంతుల్లో) ఔట్ చేసి కాస్త పోటీలోకి వచ్చారు. కానీ బట్లర్ దూకుడుగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్లో ఒక్క పరుగు అవసరమవ్వగా బట్లర్ 94 పరుగుల వద్ద నిలిచాడు. గ్రీన్ వేసిన బంతిని స్టాండ్స్కు తరలించి సెంచరీ సాధించాడు.
విరాట్ ఇన్నింగ్స్ హైలైట్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి అదిరే ఆరంభం లభించింది. డుప్లెసిస్ (44; 33 బంతుల్లో), కోహ్లి తొలి వికెట్కు 14 ఓవర్లలో 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ శుభారంభాన్ని బెంగళూరు భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఓ ఎండ్లో కోహ్లి నిలకడగా పరుగులు సాధించినప్పటికీ మరో ఎండ్ నుంచి సహకారం కరువైంది. మాక్స్వెల్ (1; 3 బంతుల్లో), సౌరవ్ చౌహన్ (9; 6 బంతుల్లో), కామెరూన్ గ్రీన్ (5*; 6 బంతుల్లో) నిరాశపరిచారు.
ఆర్సీబీ ఇన్నింగ్స్లో కోహ్లి ఆటనే హైలైట్. బౌండరీలతో పాటు సిక్సర్లతో హోరెత్తించాడు. 67 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ మిగిలిన బ్యాటర్లలో ఎవరూ సత్తాచాటకపోవడం ఆర్సీబీకి ఎదురుదెబ్బగా మిగిలింది. కోహ్లి మినహా మిగిలిన బ్యాటర్లు 48 బంతుల్లో 59 పరుగులే చేశారు.