మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మొదలుకానున్న ఈ 17వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని పంజాబ్ కింగ్స్ కసితో ఉంది. దాని కోసం ఈ సారి కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. అయితే ఆ ప్లాన్ ఎవరూ ఊహించనిది.
సాధారణంగా ప్రణాళిక అంటే కోచ్, కెప్టెన్, తుదిజట్టులో మార్పులుగా అందరూ భావిస్తారు. కానీ పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి తమ హోమ్ గ్రౌండ్ను మార్చుకుంది. ముల్లాన్పూర్లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియాన్ని తమ సొంతమైదానంగా ప్రకటించింది. అంతకుముందు మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియం హోమ్ గ్రౌండ్గా ఉండేది.

గత 16 సీజన్లలో మరే జట్టు చేయనన్ని మార్పులను పంజాబ్ కింగ్స్ చేస్తోంది. కెప్టెన్లను మార్చింది. జెర్సీ, లోగోలను ఛేంజ్ చేసింది. అంతేగాక కలిసిరావాలని జట్టు పేరులో కూడా మార్పులు చేసింది. తాజాగా హోమ్ గ్రౌండ్ను మార్చింది. మరి, ఈ సారి అయినా ట్రోఫీని సాధిస్తుందో లేదో చూడాలి.
ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరింది. 2008లో సెమీస్కు చేరింది. 2014లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. టేబుల్ టాప్లో నిలిచి టైటిల్కు ఫేవరేట్గా అంచనాలు నెలకొల్పింది. కానీ ఫైనల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు నాకౌట్ స్టేజ్కు పంజాబ్ చేరలేకపోయింది.
కాగా, ఇటీవల జరిగిన వేలంలో పంజాబ్ ఆకట్టుకునే విధంగా ప్లేయర్లను కొనుగోలు చేసింది. డెత్ బౌలింగ్లో మరింత పటిష్టంగా నిలిచేందుకు హర్షల్ పటేల్ కోసం అత్యధికంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. అలాగే బ్యాకప్ బ్యాటర్ కోసం రొసోకు రూ.8 కోట్లు కుమ్మరించింది. క్రిస్ వోక్స్కు రూ.4.20 కోట్లు, తనయ్ త్యాగరాజన్, విశ్వనాథ్, అశుతోష్, శశాంక్, ప్రిన్స్లకు తలో రూ.20 లక్షలు ఖర్చు పెట్టింది.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, లివింగ్స్టోన్, మాథ్యూ షార్ట్, సామ్ కరన్, రోసో, సికందర్ రజా, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ , నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, హర్ప్రీత్ భాటియా, అథర్వ తైదే, రిషి ధావన్, శివమ్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, గుర్నూర్ బ్రార్, విద్వాత్ కవేరప్ప, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి.