సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. స్టార్ ప్లేయర్లతో పాటు అన్క్యాప్డ్ ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటంతో నయా జోష్లో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్, ట్రావిస్ హెడ్ విఫలమైనా అభిమానులు ఫ్యాన్స్ ఆందోళన చెందట్లేదు. యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారనే ధీమాతో ఉంటున్నారు. దానికి తగ్గట్లుగానే కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు.
ఈ సీజన్లో అయిదు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ మూడింట్లో గెలిచింది. ఈ విజయాల్లో కీలకపాత్ర పోషించింది కుర్రాళ్లే. అభిషేక్ శర్మ రెండు సార్లు, నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. ఇక మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో నితీశ్ (64; 37 బంతుల్లో, 4x4, 5x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఆదుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 14 పరుగులే చేసిన నితీశ్ తర్వాత పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూ 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఉగాది రోజన తెలుగోడి పవర్ను ప్రపంచానికి చాటి చెప్పాడు.

ఈ నేపథ్యంలో నితీశ్ రెడ్డికి సంబంధించిన రెండు స్పెషల్ వీడియోలను సన్రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఓ వీడియోలో నితీశ్ మాట్లాడుతూ.. ఈ ఉగాది జట్టుకు, తనకు ఎంతో కలిసొచ్చిందని అన్నాడు. మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ను గెలిచినందకు సంతోషంగా ఉందని స్పెషల్ మెడల్ ధరించి నితీశ్ తెలిపాడు.
SRH మరో ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంకాక ముందు నితీశ్ చేసిన వ్యాఖ్యలను గుంటూరు కారం సాంగ్తో రీమిక్స్ చేసి షేర్ చేసింది. దీనిలో.. గత సీజన్లో తనని ఓ బౌలర్గానే చూశారని, ఈ సీజన్లో తెలుగు ప్రజలు నయా ఆల్రౌండర్ను చూస్తారని నితీశ్ రెడ్డి కాన్ఫిండెట్గా చెప్పాడు. నితీశ్ చెప్పినట్లుగానే ఆల్రౌండ్షోతో పంజాబ్ మ్యాచ్లో సత్తాచాటాడు. అర్ధశతకంతో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా పడగొట్టాడు.