ఐపీఎల్ 17వ సీజన్లో రెండో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ముల్లాన్పూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 453 రోజుల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది.
మిచెల్ మార్ష్తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించాడు. మార్ష్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. రెండు బౌండరీలు, రెండు సిక్సర్లు సాధించాడు. మరోవైపు వార్నర్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఓవర్ హైట్ బౌన్సర్ను బౌండరీకి యత్నించి ఔటయ్యాడు.

అయితే రబాడ బౌలింగ్లో వార్నర్ కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. అయిదో ఓవర్ అయిదో బంతిని ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ స్టాండ్స్కు తరలించాడు. తన పొజిషన్ నుంచి ఎడమవైపుకు జరిగి స్కూప్ షాట్తో షార్ట్ ఫైన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో డైవ్ చేస్తూ బంతిని బాదడం విశేషం. అంతకుముందు రబాడ స్లో డెలివరీ వేశాడు. దీంతో ఈ బంతి వేగంగా వస్తుందని వార్నర్ ముందే గ్రహించి అద్భుతమైన షాట్ ఆడాడు.
కాగా, వార్నర్ అంతకుముందు అర్షదీప్ బౌలింగ్లో కూడా సిక్సర్ బాదాడు. అయితే 2023 సీజన్లో వార్నర్ సిక్సర్ సాధించడానికి 247 బంతులు తీసుకున్నాడు. ఏడు ఇన్నింగ్స్లు ఎదురుచూశాడు. కానీ ఈ సీజన్లో తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే సిక్సర్గా మలిచాడు. గత సీజన్లో కెప్టెన్ కావడంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడేమో, కానీ ఇప్పుడు రిషబ్ పంత్ జట్టులోకి రావడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు.
మరోవైపు రీఎంట్రీ ఇచ్చిన పంత్ నిలకడగా ఆడాడు. క్రీజులో కుదురుకోవడానికి సమయాన్ని కేటాయించాడు. కానీ మునపటిలా బ్యాటును ఝుళిపించలేకపోయాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. 4 పరుగుల వద్ద లభించిన లైఫ్ను ఉపయోగించుకోలేకపోయాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.