ఐపీఎల్ 17వ సీజన్లోని రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటుతోంది. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో 10.3 ఓవర్లకు 94/2తో మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ 19 ఓవర్లకు 149/8 స్కోరు మాత్రమే సాధించింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ (32*; 10 బంతుల్లో) ఊచకోతతో ఢిల్లీ గొప్ప స్కోరు సాధించింది. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో అభిషేక్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాది 25 పరుగులు పిండుకున్నాడు. షై హోప్ (33; 25 బంతుల్లో), డేవిడ్ వార్నర్ (29; 21 బంతుల్ల) సత్తాచాటారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఢిల్లీకి శుభారంభం లభించింది. మిచెల్ మార్ష్తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించాడు. అయితే 12 బంతుల్లో 20 పరుగులు చేసి జోరు మీదున్న మార్ష్ను అర్షదీప్ ఔట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన షై హోప్ కూడా ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది.

పవర్ప్లేలో ఢిల్లీ 54 పరుగులు సాధించింది. కాగా, వార్నర్ను హర్షల్ పటేల్ బోల్తాకొట్టించాడు. హై బౌన్సర్ను షాట్కు యత్నించిన వార్నర్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను హోప్ తీసుకున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన పంత్ (18; 13 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ రబాడ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్కు చేరాడు.
అనంతరం పంత్ గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. బౌండరీ బాది తన లయను అందుకున్నట్లు కనిపించాడు. కానీ హర్షల్ పటేల్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై బెయిర్స్టో చేతికి చిక్కాడు. పంత్కు నాలుగు పరుగుల వద్దే లైఫ్ లభించింది. కాగా, పంజాబ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు.
దీంతో తొలి ఇన్నింగ్స్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ను ఢిల్లీ బరిలోకి దించింది. రికీ భుయ్ (3; 7 బంతుల్లో) స్థానంలో బెంగాల్కు చెందిన యువ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ జట్టులోకి వచ్చాడు. ఆ వ్యూహం ఫలించింది. అభిషేక్ బౌండరీలతో హోరెత్తించాడు. అక్షర్ పటేల్ (21; 13 బంతుల్లో) కీలక పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్షదీప్ చెరో రెండు వికెట్లు, రబాడ, హర్ప్రీత్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.