Matheesha Pathirana: మతీషా పతిరాన.. బౌలింగ్ సంచలనం. శ్రీలంకకు చెందిన ఈ యంగ్ పేస్ బౌలర్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటుతున్నాడు. లెజెండరీ బౌలర్ లసిత్ మలింగను గుర్తు చేసేలా బంతులను సంధించే ఈ యువ బౌలర్.. సీఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా ఎదుగుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేశాడు. ధోనీ వల్ల చాలా నేర్చుకున్నానని పేర్కొన్నాడు. ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టంగా అభివర్ణించాడు. తన కేరీర్ను తీర్చిదిద్దుతున్నాడని, తండ్రి పాత్రను పోషిస్తోన్నాడని కితాబిచ్చాడు.

క్రికెట్లో తన ఎదుగుదలకు ధోనీ ఎంతగానో సహకరిస్తోన్నాడని, అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నందున విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తోన్నాడని అన్నాడు. తన పట్ల ఎంతో ఆప్యాయతను చూపుతున్నాడని, ఓ తండ్రిలా మార్గదర్శకం చేస్తోన్నాడని చెప్పాడు.
ఇంట్లో తండ్రి తనతో ఎలా వ్యవహరిస్తారో.. జట్టులో ధోనీ తన పట్ల అంతే కేర్ తీసుకుంటాడని మతీషా పతిరానా పేర్కొన్నాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్లో ధోనీ ఇచ్చే చిన్న చిన్న సలహాలు సైతం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని, వాటి వల్ల తాను క్రికెట్లో పరిణతి సాధించానని వివరించాడు.
వచ్చే సీజన్లో కూడా ధోనీ ఐపీఎల్ మ్యాచ్లను ఆడాలని తాను బలంగా కోరుకుంటోన్నానని మతీషా చెప్పాడు. తనలాంటి యంగ్ క్రికెటర్ల కోసమైనా ధోనీ ఐపీఎల్ 2025 ఖచ్చితంగా ఆడాలని రిక్వెస్ట్ చేశాడు. ప్రతి యంగ్ క్రికెటర్కూ ధోనీ ఓ పాఠం లాంటివాడని, ఆయన నుంచి స్ఫూర్తిని పొందుతున్నామని వ్యాఖ్యానించాడు.