ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కు ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో క్రికెట్ ఆడే దాదాపు ప్రతి ప్లేయర్ ఈ లీగ్లో ఒక్కసారైనా ఆడాలనే అనుకుంటాడు. 2008లో ఈ లీగ్ మొదలైనప్పుడు అన్ని దేశాల ప్లేయర్లు వేలంలో పాల్గొని భారీగా డబ్బులు కూడా కళ్లజూశారు. కానీ ఆ తర్వాత బోర్డర్ వద్ద ఉద్రిక్తల కారణంగా పాకిస్తాన్ ప్లేయర్లు ఐపీఎల్లో ఆడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో చాలా మంది పాకిస్తానీ ప్లేయర్లు తమకు ఐపీఎల్ ఆడాలని ఉందని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. పాకిస్తాన్ తమకంటూ ప్రత్యేకంగా పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) ఏర్పాటు చేసుకున్నా కూడా.. ఐపీఎల్ క్రేజ్ తగ్గలేదు. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ హసన్ అలీ కూడా తనకు ఐపీఎల్ ఆడాలని ఉందని చెప్పాడు. అది తన కల అన్నాడు.

ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్ అని చెప్పిన ఈ కుడి చేతి వాటం పేసర్.. తనకు ఈ లీగ్ ఆడాలని ఎప్పటి నుంచో కోరిక ఉందన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్లో షాహిద్ అఫ్రిదీ, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్, సల్మాన్ బట్, యూనిస్ ఖాన్, సొహైల్ తన్వీర్ తదితర పాకిస్తాన్ ప్లేయర్లు ఆడారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లపై బీసీసీఐ నిషేధం విధించింది.
ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పుడప్పుడే మార్చుకునేలా లేదు కూడా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హసన్ అలీ.. 'ప్రతి ప్లేయర్కూ ఐపీఎల్లో ఆడాలని ఉంటుంది. నాకూ అలాగే ఐపీఎల్ ఆడాలని ఉంది. అది ప్రపంచంలోని అతిపెద్ద లీగ్లలో ఒకటి. నాకు భవిష్యత్తులో ఏమాత్రం అవకాశం వచ్చినా ఐపీఎల్ ఆడతా' అని చెప్పాడు. ఈ అవకాశం రావాలంటే అతను పాకిస్తాన్ వీడాల్సి ఉంటుంది. అక్కడి నుంచి యూరప్లో ఏదో ఒక దేశానికి వెళ్లి, అక్కడి పౌరసత్వం తీసుకొని ఐపీఎల్ వేలానికి రావలసి ఉంటుంది. మరి అలీ ఏం చేస్తాడో చూడాలి.