ఊహించిందే జరిగిందే. సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ను నియమించింది. ఎయిడెన్ మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్ సారథి బాధ్యతలు అందుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టును కమిన్స్ నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ట్విటర్ వేదికగా సోమవారం ప్రకటించింది.
'ఆరెంజ్ ఆర్మీ.. మన కొత్త నాయకుడు ప్యాట్ కమిన్స్' అని ట్విటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసింది.
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ కోసం సన్రైజర్స్ రూ.20.50 కోట్లు కుమ్మరించిన విషయం తెలిసిందే. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కోసం త్రిముఖ వ్యూహంతో భారీ ధర వెచ్చించింది. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు కెప్టెన్గా ఉపయోగించుకోవచ్చని కమిన్స్ను సొంతం చేసుకుంది.

హైదరాబాద్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన ఆస్ట్రేలియా మూడో ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కనున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మన తెలుగు జట్టును నడిపించిన విషయం తెలిసిందే. డెక్కన్ ఛార్జర్స్గా ఉన్నప్పుడు గిల్క్రిస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. వార్నర్, గిల్క్రిస్ట్ ఇద్దరూ జట్టును ఛాంపియన్గా నిలిపారు.
మరోవైపు గత సీజన్లో సన్రైజర్స్ను నడిపించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ తన మార్క్ను చూపలేకపోయాడు. 13 మ్యాచ్ల్లో నాలుగింట్లో మాత్రమే విజయాలు అందుకున్నాడు. పాయింట్ల పట్టికలో జట్టును అట్టడుగున నిలిపాడు. కానీ దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఫ్రాంచైజీ తరఫున ఈస్టర్న్ కేప్ను మార్క్రమ్ గొప్పగా నడిపిస్తున్నాడు. గత రెండు సీజన్లను జట్టును ఛాంపియన్గా నిలిపాడు. కానీ ఐపీఎల్లో మాత్రం సత్తాచాటలేకపోతున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.