ఐపీఎల్-2024 సీజన్కు మరో ప్లేయర్ దూరమయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ డేవిడ్ విల్లీ వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడిచిపెట్టడంతో వేలానికి వచ్చిన విల్లీని లక్నో రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. బంతితో పాటు బ్యాటుతోనూ రాణించే విల్లీ తమ జట్టుకు సమతూకం తీసుకువస్తాడని భావించి విల్లీని లక్నో కొనుగోలు చేసుకుంది.
అయితే ఈ సీజన్ను నుంచి తప్పుకున్న విల్లీ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీని లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. అతని కనీస ధర రూ.1.25 కోట్లు చెల్లించనుంది. కాగా, హెన్రీ గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తుది జట్టులో అతడు చోటు దక్కించుకోనప్పటికీ పంజాబ్ తరఫున మైదానంలో అడుగుపెట్టాడు. 2017 సీజన్లో రెండు మ్యాచ్లు ఆడాడు.

ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో హెన్రీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ తరఫున హెన్రీ ఇప్పటివరకు 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. మరోవైపు ఈ సీజన్ నుంచి తప్పుకున్న అయిదో ఇంగ్లిష్ ప్లేయర్గా డేవిడ్ విల్లీ నిలిచాడు. జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ లీగ్కు ఇప్పటికే దూరమైన విషయం తెలిసిందే.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, శివమ్ మావి, మణిమారన్ సిద్ధార్థ్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, షామర్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మ్యాట్ హెన్రీ.