ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దారుణంగా విమర్శించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్వార్థంతో హార్దిక్ తీసుకున్న నిర్ణయాలే ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమయ్యాయని అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్పై ముంబై ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు.

అయితే ఓ దశలో ముంబై విజయానికి చివరి 6 ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. ముంబై చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కానీ ఫేవరేట్గా ఉన్న ముంబై విజయతీరాలకు చేరలేకపోయింది. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషిస్తూ హార్దిక్ నిర్ణయాలను తప్పుపట్టాడు. ఆటకు చాలా కాలం దూరమవ్వడం, రషీద్ ఖాన్ను ఎదుర్కోలేక హార్దిక్ కావాలనే ఆలస్యంగా బ్యాటింగ్కు వెళ్లాడని ఇర్ఫాన్ అన్నాడు. అలాగే బుమ్రాను కాదని హార్దిక్ బౌలింగ్ ప్రారంభించడం ఘోరమైన తప్పిదమని అభిప్రాయపడ్డాడు.
''ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్య చేసిన ఘోరమైన తప్పిదం ఏంటంటే.. పవర్ప్లేలో అతడే రెండు ఓవర్లు బౌలింగ్ వేయడం. జస్ప్రీత్ బుమ్రాతో హార్దిక్ కాస్త ఆలస్యంగా బౌలింగ్ చేయించాడు. ఇక ముంబై ఛేజింగ్లో బ్యాటింగ్ ఆర్డర్లో టిమ్ డేవిడ్ను ప్రమోట్ చేశారు. రషీద్ ఖాన్కు మరో ఓవర్ ఉన్న సమయంలో డేవిడ్ను పంపించారు''
''రషీద్ ఖాన్ను ఎదుర్కోలేక, అలాగే ఆటకు దూరమై సుదీర్ఘకాలం అవ్వడంతో హార్దిక్ బ్యాటింగ్కు రాలేదనుకుంటా. అనుభం ఉన్న టీమిండియా బ్యాటర్ హార్దిక్ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని, రషీద్ ఖాన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఒత్తిడిలో ఓ విదేశీ ప్లేయర్ను పంపించడాన్ని నేను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించను'' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కాగా, ఆరో స్థానంలో వచ్చిన డేవిడ్ 11 బంతుల్లో 10 పరుగులు, ఏడో స్థానంలో వచ్చిన హార్దిక్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యారు.