డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 17వ సీజన్లోనూ సత్తాచాటుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. చెపాక్ వేదికగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల భారీ తేడాతో గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మెరిసి ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె (51; 23 బంతుల్లో),రచిన్ రవీంద్ర (46; 20 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37; 31 బంతుల్లో) పోరాడాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే తలో రెండు వికెట్లు తీశారు.

మ్యాచ్ అనంతరం చెన్నై నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న దూబెను కొనియాడాడు. అతడు జట్టుకు బలమని అన్నాడు. దూబె విధ్వంసకర ఇన్నింగ్స్లకు ధోనీ, టీమ్ మేనేజ్మెంట్ కారణమని రుతురాజ్ చెప్పాడు.
''ఇవాళ మ్యాచ్ పర్ఫెక్ట్గా సాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సత్తాచాటాం. గుజరాత్ వంటి జట్టుతో మ్యాచ్ ఇలాంటి ప్రదర్శనే చేయాలి. చెన్నైలో పిచ్ గురించి అంచనా వేయలేం. మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా సరే రాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జట్టుకు ఆఖర్లో చేతిలో వికెట్లు ఉంటే చాలా లాభంగా ఉంటుంది. పవర్ప్లేలో రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడాడు. మ్యాచ్ను మావైపు తిప్పేశాడు. అక్కడ నుంచి మేం పైచేయి సాధించాం''
''దూబె కోసం మేనేజ్మెంట్, ధోనీ ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. దూబెకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. జట్టులో తన పాత్రేంటో తనకు తెలుసు. అతడు జట్టుకు ఎంతో బలం. ఇవాళ మేం ఫీల్డింగ్ గొప్పగా చేశాం. ఈ ఏడాది ఇద్దరు, ముగ్గురు యువకులు జట్టులో చేరారు. రహానె సూపర్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు. గత మ్యాచ్లో కూడా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు'' అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.