MS Dhoni: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ పాపులర్ ప్లేయర్లల్లో ఒకడు మహేంద్ర సింగ్ ధోనీ. అప్పుడెప్పుడో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా అది రోజురోజుకూ పెరుగుతోంది. క్రికెట్కు గుడ్బై చెప్పిన తరువాత కూడా ఆరాధ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్ ధోనీ ఒక్కడే అనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఐపీఎల్.. ధోనీకి కోట్లాదిమంది అభిమానులను సంపాదించి పెట్టింది. 2008 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ అంటే తమిళియన్లు ఎంతగానో ఆరాధిస్తారు.. అభిమానిస్తారు. ఈ విషయంలో చిన్నా, పెద్దా అనే తేడాలేవీ ఉండట్లేదు. వయస్సులో ఎలాంటి భేదాలు చూపట్లేదు.

దీనికి కారణాలు లేకపోలేదు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపీఎల్లోనూ అదే స్థాయిలో ఆడుతుండటం ఒక ఎత్తయితే- తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ను మోస్ట్ సక్సెస్ఫుల్గా నిలిపడం మరో ఎత్తు. అయిదు సార్లు ఈ జట్టును ఛాంపియన్గా నిలిపాడు ధోనీ.
అందుకే- చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకూ అందరూ ధోనీని అభిమానించే వారే. దీనికి తాజా ఉదాహరణ.. ఈ ఘటన. 103 సంవత్సరాల వయస్సు ఉన్న రామదాస్ అనే వయోధిక వృద్ధుడు.. ధోనీకి వీరాభిమాని. తమిళనాడుకు చెందిన రామదాస్.. ఐపీఎల్ ఆరంభం నుంచీ ఆయన చెన్నై సూపర్ కింగ్స్ను ఎంతగా అభిమానిస్తారో.. అంతకంటే ఎక్కువ ధోనీని.
ముందు నుంచీ సీఎస్కేకు సపోర్ట్గా ఉంటూ వస్తోన్న రామదాస్కు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు ధోనీ. తన సంతకంతో కూడిన షర్ట్ను ఆయనకు పంపించారు. థాంక్స్ తాత.. ఫర్ యువర్ సపోర్ట్.. అని రాసి సంతకం చేసిన షర్ట్ అది. దాన్ని అందుకుని చిన్నపిల్లాడిలా మురిసిపోయారు రామదాస్.