ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఇంకా నాలుగైదు నెలలు ఉండగానే.. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ మెగా ఈవెంట్లో పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. మొన్నటికి మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్కు స్థానచలనం కలిగింది.

జింబాబ్వేకు చెందిన లెజెండరీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్ను కొత్త హెడ్ కోచ్గా ప్రకటించింది. హెడ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో అతన్ని అపాయింట్ చేసుకుంది ఆర్సీబీ. ఫ్రాంఛైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్, సంజయ్ బంగర్ కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు. వారిద్దరి స్థానంలో ఆండీ ఫ్లవర్ను తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీల్లో చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్గా న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ షేన్ బాండ్ అపాయింట్ అయ్యాడు. అతని స్థానంలో శ్రీలంక లెజెండరీ ప్లేయర్ లసిత్ మలింగతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ముంబై ఇండియన్స్.
తాజాగా- ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటంపైనా అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ధోనీకి ఇటీవలే సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్లో ఉంటోన్నాడు. కొద్ది రోజులుగా బ్యాట్కు దూరంగా ఉంటోన్నాడు. సర్జరీ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటోన్నాడు.

తనకు సర్జరీ అయిన విషయాన్ని ధోనీ ధృవీకరించాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఆపరేషన్ నుంచి కోలుకుంటోన్నానని వివరించాడు. అంతా బాగుంటే తాను ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఆడతానని స్పష్టం చేశాడు. ఆరోగ్యపరమైన సమస్యలు లేక మోకాలి నొప్పులు తలెత్తితే మాత్రం ఆడియన్స్తో పాటు స్టేడియంలో కూర్చుని ఐపీఎల్ మ్యాచ్లను చూస్తానని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మినీ వేలం పాటలను నిర్వహించాల్సి ఉంది. దీనికోసం నవంబర్ 15వ తేదీ నాటికి రిటెన్షన్ ప్లేయర్ల వివరాలతో కూడిన జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం తాను ఈ పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని ధోనీ స్పష్టం చేశాడు.