ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడాలని ఆసీస్ స్టార్ డిసైడ్ అయ్యాడు. 2015 నుంచి ఐపీఎల్కు దూరంగా ఉన్న ఆసీస్ పేస్ గుర్రం మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నాడు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న అతను.. వచ్చే ఐపీఎల్ వేలంలో తను కూడా పాల్గొంటానని ప్రకటించాడు. ఆసీస్కు ఆడటానికి ప్రాముఖ్యత ఇచ్చిన స్టార్క్.. గాయాల భయంతో ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు.
అంతకుముందు స్టార్క్ కోసం వేలంలో మంచి పోటీ ఉండేది. 2014, 2015 రెండేళ్లు ఆర్సీబీ తరఫున స్టార్క్ ఆడాడు. ఆ మరుసటి ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ ఆడలేదు. ఆ తర్వాతి సంవత్సరం ఐపీఎల్ ఆడకూడదని స్టార్క్ అనుకున్నాడు. అనంతరం 2018లో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా అతను ఈ ఐపీఎల్ ఆడలేదు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీతో కేసు నడిచింది. అది 2020లో ముగిసింది.

ఇక 2019లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్కు దూరంగా ఉన్నారు. వారిలో స్టార్క్ కూడా ఒకడు. ఇక ఈ ఏడాది ఆసీస్ జట్టు చాలా బిజీగా గడిపింది. దానికితోడు స్టార్క్ భార్య, క్రికెటర్ అలీసా హేలీ కూడా చాలా బిజీగా గడిపింది. దీంతో ఐపీఎల్కు స్టార్క్ దూరంగా ఉన్నాడు. ఇలా ఆస్ట్రేలియా టీం లేదా కుటుంబానికి ఎక్కువ విలువనిస్తూ ఐపీఎల్కు దూరంగా ఉంటూ వచ్చాడీ ఆసీస్ స్టార్.
అయితే వచ్చే ఏడాది యూఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. దానికి ఐపీఎల్ బాగా ఉపయోగపడుతుందని స్టార్క్ అనుకుంటున్నాడు. అందుకే వచ్చే ఐపీఎల్ వేలంలో పాల్గొంటానని చెప్పాడు. 'వచ్చే సంవత్సరం ఐపీఎల్ కచ్చితంగా ఆడతా. టీ20 వరల్డ్ కప్కు మంచి ప్రిపరేషన్గా ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది ఇంత బిజీగా ఉండదు. కాబట్టి ఇదే మంచి టైం అనుకుంటున్నా' అని స్టార్క్ చెప్పుకొచ్చాడు.