వచ్చే ఏడాది జరిగే క్రికెట్ పండుగ ఐపీఎల్కు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇటీవల వరల్డ్ కప్ ముగిసిన అనంతరం.. క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. వచ్చే నెలలో జరగనున్న మినీ వేలమే దానికి కారణం. గతేడాది ఇదే సమయంలో కూడా ఐపీఎల్ మినీ వేలం గురించే చర్చ జరిగింది. ఆ వేలంలో కొన్ని రికార్డులు బద్దలయ్యాయి కూడా.
బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, శామ్ కర్రాన్ వంటి ఆల్రౌండర్లపై గతేడాది మినీ వేలంలో కాసుల వర్షం కురిసింది. ఈసారి కూడా అలాగే కొత్త ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు ట్రేడింగ్ విండోలో తమ ఆటగాళ్లను ఇతరులతో ట్రేడ్ చేసుకుంటున్నాయి కూడా. ఇలాంటి సమయంలో మినీ వేలం గురించి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది.

ఈ వేలంలో మొత్తం 590 మంది ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారట. మిచెల్ స్టార్క్ వంటి ప్లేయర్లు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ క్రికెట్ పండుగలో పాల్గొనేందుకు తిరిగొస్తుండటంతో అందరి దృష్టీ ఈ వేలంపై పడింది. డిసెంబరు నెలాఖరులో ఈ వేలం జరుగుతుంది. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను ఈసారి మరింత పెంచడంతో.. వాళ్లు కూడా సత్తా ఉన్న ఆటగాళ్ల కోసం వేట మొదలు పెట్టారు.
ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, కివీస్ కొత్త సంచలనం రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ కోట్జీ వంటి సత్తా ఉన్న ప్లేయర్లు ఈసారి వేలంలో అధిక ధర పలుకుతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ ప్లేయర్ల జాబితా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఈ వేలంలో కూడా పంజాబ్ కింగ్స్ జట్టు భారీ పర్స్తో బరిలో దిగుతుందని తెలుస్తోంది.