ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఓటముల్లో హ్యాట్రిక్ సాధించింది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘోరపరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 125 పరుగులు చేసింది. చాహల్ (3/11), బౌల్ట్ (3/22), బర్గర్ (2/32) బంతితో చెలరేగారు.
బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ, నమన్, బ్రెవిస్ గోల్డెన్ డక్ అయ్యారు. మరోవైపు ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో) తన ఫామ్ను కొనసాగిస్తూ మరో అర్ధశతకం సాధించాడు.

విజయానంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడాడు. ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించిందని, టాస్ గెలవడంతో మ్యాచ్ ప్రారంభంకాక ముందే హార్దిక్సేనపై పైచేయి సాధించామని శాంసన్ అన్నాడు. విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారని తెలిపాడు. బౌల్ట్, బర్గర్ అందించిన శుభారంభాన్ని అశ్విన్, చాహల్ తమ స్పిన్తో అదే జోరును కొనసాగించి ప్రత్యర్థిని కట్టడిచేశారని శాంసన్ పేర్కొన్నాడు.
''ఈ మ్యాచ్లో టాస్ గేమ్ ఛేంజర్. మొదట బ్యాటింగ్కు ఈ వికెట్ అంత సులువు కాదు. బౌల్ట్, బర్గర్ తమ అనుభవంతో మమ్మల్ని టాప్లో నిలిపారు. బౌల్ట్ గత 10 నుంచి 15 ఏళ్లుగా ఆడుతున్నాడు. కొత్తబంతితో తన నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుంటాం. అలా అనీ, నాలుగు, అయిదు వికెట్లు పడగొట్టాలని అంచనాలు లేవు. కానీ మా బౌలర్లు గొప్పగా సత్తాచాటుతారని తెలుసు''
''మా జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నారు. జట్టులో వాళ్ల బాధ్యతలు వాళ్లకు తెలుసు. వాటిని నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. మాకు మంచి పవర్ప్లే దక్కిందని అశ్విన్, చాహల్ భావించారు. అందుకే వికెట్లపై దృష్టి పెట్టకుండా పరుగులు నియంత్రిస్తూ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఐపీఎల్ సీజన్లో చాహల్ చాలా కసితో ఉన్నాడు. గత రెండు-మూడు సీజన్లుగా అతడు మా తరఫున గొప్పగా రాణిస్తున్నారు'' అని శాంసన్ పేర్కొన్నాడు.