ముంబై ఇండియన్స్కు మరో పరాభవం. వరుసగా ఊహించని షాక్లతో హ్యాట్రిక్ ఓటములు. సొంతమైదానంలో అయినా MI విజయం సాధిస్తుందనుకుంటే ముంబై అభిమానులకు పూర్తిగా నిరాశే మిగిలింది. హిట్టర్లు బ్యాట్లేత్తెశారు. స్వల్ప స్కోరును బౌలర్లు కాపాడుకోలేకపోయారు. మొత్తంగా రాజస్థాన్ చేతిలో ముంబై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో హోమ్గ్రౌండ్లో ఓడిన రెండో జట్టుగా ఆర్సీబీ సరసన ముంబై నిలిచింది.
వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 125 పరుగులు చేసింది. చాహల్ (3/11), బౌల్ట్ (3/22), బర్గర్ (2/32) బంతితో చెలరేగారు. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ, నమన్, బ్రెవిస్ గోల్డెన్ డక్ అయ్యారు. మరోవైపు ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో) తన ఫామ్ను కొనసాగిస్తూ మరో అర్ధశతకం సాధించాడు.

కాగా, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వివాదంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబైకు అసలైన బలం సూర్యకుమార్ యాదవ్ అని, అతడిని జట్టు చాలా మిస్ అవుతుందని గవాస్కర్ అన్నాడు. సూర్య గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నాడు. అలాగే రోహిత్ ఔటైన తీరును విశ్లేషించాడు.
''రోహిత్ ఔటైన తీరును ఓసారి పరిశీలించండి. బౌల్ట్ అద్భుతమై సీమ్ వేశాడు. రోహిత్ తన దగ్గరకు వచ్చే బంతిని హిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అలాగే లైన్ మీదుగా వెళ్లే బంతిని వెంబడిస్తుంటాడు. అదే రీతిలో ఈ సారి ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత ఔటైన నమన్కు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. రాంగ్ లైన్లో ఆడుతూ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు''

''సూర్యకుమార్ యాదవ్ను ముంబై ఇండియన్స్ కచ్చితంగా మిస్ అవుతుంది. మూడో స్థానంలో వచ్చే సూర్య ప్రతిదాడికి దిగుతూ బ్యాటింగ్ చేస్తాడు. కానీ అతడు ఇప్పుడు అందుబాటులో లేడు. సూర్య త్వరగా జట్టుతో చేరాలని ముంబై ఇండియన్స్ ప్రార్థిస్తుంటుంది. ఎందుకంటే సూర్య గేమ్ ఛేంజర్. అతడు మ్యాచ్ను మార్చేయగలడు'' అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. సర్జరీ చేయించుకున్న అనంతరం సూర్య క్రికెట్కు దూరమయ్యాడు. వేగంగా కోలుకుని ఫిట్నెస్ సాధించాడు. కానీ ఐపీఎల్లో పాల్గొనడానికి ఎన్సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం సూర్య ఎదురుచూస్తున్నాడు.