Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి బొక్క బోర్లా పడింది. ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడింది. స్కోర్ బోర్డ్ మీద జమ చేసిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో ఓటమి.
ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 9. ఇక తన తదుపరి మ్యాచ్ను ఈ నెల 15వ తేదీన ఆడబోతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టబోతోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.

గురువారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. దాన్ని అలవోకగా కొట్టిపడేశారు ముంబై బ్యాటర్లు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఇంత భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారకులు కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటిదార్, వికెట్కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్. ఈ ముగ్గురూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీళ్లు తప్ప మరెవరూ కూడా కనీసం రెండంకెల వ్యక్తిగత స్కోర్ కూడా చేయలేపపోయారు.. చివరికి విరాట్ కోహ్లీ కూడా.
ఇక ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ మ్యాచ్లో కూడా డకౌట్ అయ్యాడు.. ఎప్పట్లాగే. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లను ఆడిన మ్యాక్సీ చేసింది 32 పరుగులే. ఇందులో అత్యధికం 28. ఈ ఆరు మ్యాచ్లల్లో అతను చేసిన స్కోర్.. 0,3,28,0,1,0. ఇదో ఎవరూ కోరుకోని చెత్త రికార్డ్ అన్నమాట.
ఐపీఎల్ అన్ని సీజన్లకు కలిపి మోస్ట్ డకౌట్ అయిన బ్యాటర్ల సరసన చేరాడు మ్యాక్స్వెల్. ఇప్పటివరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ఇప్పటిదాకా 248 ఐపీఎల్ మ్యాచ్లను ఆడిన ఈ హిట్ మ్యాన్ 17 సార్లు డకౌట్ అయ్యాడంటే నమ్మగలరా?. అలాగే దినేష్ కార్తీక్ పరిస్థితి కూడా అంతే. 17 సార్లు జీరోకే అవుట్ అయ్యాడు.
ఈ చెత్త రికార్డు రోహిత్ శర్మ నుంచి మ్యాక్స్వెల్కు బదిలీ అయినట్టయింది. రషీద్ ఖాన్- 15, పీయూష్ చావ్లా- 15, మన్దీప్ సింగ్- 15, సునీల్ నరైన్- 15, మనీష్ పాండే- 14, అంబటి రాయుడు- 14, హర్భజన్ సింగ- 13 సార్లు తమ ఖాతానే తెరవకుండా అవుట్ అయ్యారు ఐపీఎల్ అన్ని సీజన్లల్లో.