Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ కుదేల్ అవుతోంది. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదీ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. గెలిచి తీరాల్సిన మ్యాచ్లన్నింట్లోనూ చతికిలపడుతూ వస్తోంది. ఫలితంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలను చేతులారా మట్టిపాలు చేసుకుంది.
ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లల్లో ఓడినవే ఎక్కువ. మూడింట్లో గెలిచింది. ఎనిమిది మ్యాచ్లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టుకు ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు జీరో.

తాజాగా కోల్కత నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ పరాభవమే ఎదురైంది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టీమ్కు. శుక్రవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లల్లో 169 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ స్కోర్ను ఛేజ్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ముంబై ఇండియన్స్. 18.5 ఓవర్లల్లో 145 పరుగులకు చాప చుట్టేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ కొంత వరకు నిప్పులు చెరుగుతున్న కేకేఆర్ బౌలర్లను ప్రతిఘటించగలిగాడు. మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలం అయ్యారు.
ఈ ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఆండ్రీ రస్సెల్స్ను ఆలస్యంగా పంపించి కోల్కత నైట్రైడర్స్ తప్పు చేసింది. అతను రెండు బంతులు మాత్రమే ఆడాడు. ముంబై ఇండియన్స్ కూడా అదే తప్పు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఆలస్యంగా వచ్చారు. దాని వల్ల ఒరిగిందేంటీ? అని ప్రశ్నించాడు.

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరఫున 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఈ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్లో అతణ్ని డిమోట్ చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించాడు. ఇప్పుడెందుకు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చాడని ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుందని తాను అనుకోవట్లేదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇలాంటి తల తిక్క ప్రయోగాలు చేయడం పట్ల ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
దీనిపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరాడు. జట్లు ప్లేయర్లపై మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని, అసలు ఏం జరుగుతుందో వారిని నిలదీయాలని అన్నాడు. జట్టు వైఫల్యానికి కెప్టెన్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, సపోర్టింగ్ స్టాఫ్.. ఇలా అందరూ బాధ్యులేనని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు.