Suryakumar Yadav: ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్లు ముగిశాయి. నేడు ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయేది 18వ గేమ్. ఈ రెండు జట్లు కూడా తమ నాలుగో మ్యాచ్ను ఆడబోతోన్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ఇన్ని మ్యాచ్లు ముగిసిన తరువాత కూడా ఇంకా బోణీ కొట్టని జట్టు ఏదయినా ఉందంటే.. అది ముంబై ఇండియన్సే. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదా జట్టు. ఆడిన మూడు మ్యాచ్లల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క పాయింట్ కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో అట్టడుగున అంటే 10వ స్థానంలో నిలిచింది.

ఈ నెల 7వ తేదీన తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది హార్దిక్ సేన. రిషభ్ పంత్ సారథ్యాన్ని వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ను ఢీకొట్టబోతోంది. తన హోమ్ పిచ్ వాంఖెడే స్టేడియంలో షెడ్యూల్ అయిన గేమ్ ఇది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమౌతుంది. ముంబై ఇండియన్స్కు లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది.
తన తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది ముంబై. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ దెబ్బకు ఠారెత్తింది. 277 పరుగులు రికార్డ్ స్కోర్ను ఛేదించలేకపోయింది. మూడో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఇంకా దారుణంగా ఆడిందీ టీమ్. తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లల్లో 129 పరుగులే చేయగలిగింది. తన నాలుగో మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొనబోతోంది.
ఈ పరిస్థితుల్లో- ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్ అందింది. టాప్ ఆర్డర్ డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ సాయంత్రం అతను జట్టుతో కలవబోతున్నాడు. గాయం కారణంగా ఇన్నాళ్లూ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్కు దూరంగా ఉంటూ వచ్చాడు. జాతీయ జట్టు తరఫున కూడా అతను కొంతకాలంగా ఆడట్లేదనే విషయం తెలిసిందే.
గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో గడిపాడు. ఫిట్నెస్ టెస్టులన్నీ పాస్ అయ్యాడు అక్కడే. దీనితో అతను వందశాతం ఫిట్నెస్ సాధించినట్లు ఎన్సీఏ తెలిపింది. ఐపీఎల్ ఆడటానికి క్లియరెన్స్ ఇచ్చింది. దీనితో అతను బెంగళూరు నుంచి ముంబైకి బయలుదేరాడు.