ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో ఓటమి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో అయిదు మ్యాచ్లు ఆడిన క్యాపిటల్స్కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ క్రమంలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగన నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది.రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6), టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో, 2x4, 4x6) సత్తాచాటారు. ఆఖర్లో షెఫార్డ్ (39*; 10 బంతుల్లో, 3x4, 4x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాది ఏకంగా 32 పరుగులు సాధించాడు.

అనంతరం ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (71*; 25 బంతుల్లో, 3x4, 7x6) గొప్పగా పోరాడాడు. పృథ్వీ షా (66; 40 బంతుల్లో, 3x4, 4x6), అభిషేక్ పోరెల్ (41; 31 బంతుల్లో, 5x4) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా (2/22), కొయెట్జీ (4/34) ఆకట్టుకున్నారు.
కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలను ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ వివరించాడు. ఛేదనలో పవర్ప్లేలో మెరుపు ఆరంభాన్ని సాధించలేకపోవడం, డెత్ ఓవర్లలో పేలవమైన బౌలింగ్ పరాజయానికి ప్రధాన కారణాలుగా పంత్ పేర్కొన్నాడు. అయితే భారీ ఛేదనకు గొప్పగానే ప్రయత్నించామని అన్నాడు. తమ జట్టులోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామని పంత్ చెప్పాడు.
''మేం పోటీలోనే నిలిచాం. కానీ పవర్ప్లేలో మెరుగైన స్కోరు సాధించలేకపోయాం. భారీ ఛేదనలో పవర్ప్లేలో భారీస్కోరు చేయడం చాలా కీలకం. ఆ తర్వాత గొప్పగా బ్యాటింగ్ చేశాం. కానీ ఆ తర్వాత మిగిలిన ఓవర్లలో సగటున 15 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు.
ఇక మా బౌలింగ్ విషయానికొస్తే.. కొన్ని పేలవమైన ఓవర్లు వేశాం. కొన్నిసార్లు ఇది జరుగుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమైన బంతులు, స్లో డెలివరీలు వేయడం ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లు బంతుల్ని సంధించాలి. డెత్ఓవర్ బౌలింగ్లో, అలాగే బ్యాటింగ్లో మేం మెరుగవ్వాల్సి ఉంది'' అని పంత్ పేర్కొన్నాడు.