MS Dhoni: ఐపీఎల్ 2024 సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. ఈ రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నై చెపాక్లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్ కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. గత సీజన్ వరకూ సీఎస్కే సారథిగా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వంలో ఎల్లో ఆర్మీ ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

శనివారం రెండు మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్.. ఢిల్లీ కేపిటల్స్ను ఎదుర్కొనబోతోంది. పంజాబ్ మొహాలీలో గల మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 3: 30 గంటలకే ఈ గేమ్ షురూ అవుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయంతో ఈ సీజన్ను ఆరంభించాలనే పట్టుదలతో ఉన్నాయవి.
గత సీజన్లో ఈ రెండూ కూడా అధ్వాన్నంగా ఆడాయి. కోల్కత నైట్ రైడర్స్ ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ.. సన్రైజర్స్ హైదరాబాద్ మరీ దారునంగా ఆడింది. లీగ్స్ దశలో ఆడిన 14 మ్యాచ్లల్లో నాలుగంటే నాలుగు మాత్రమే గెలిచింది సన్రైజర్స్ టీమ్. ఎనిమిది పాయింట్లతో సరిపెట్టుకుంది. కోల్కత ఆడిన ఎనిమిదింట్లో ఆరు మ్యాచ్లల్లో విజేతగా నిలిచింది. 12 పాయింట్లతో టేబుల్లో ఏడోస్థానానికి ఎగబాకగలిగింది.
ఈ సీజన్ కోసం రెండు జట్లు కూడా మెరికల్లాంటి ప్లేయర్లను తీసుకున్నాయి. ట్రవిస్ హెడ్, వనిందు హసరంగ, పాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కత్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఆకాష్ సింగ్, ఝఠవేద్ సుబ్రహ్మణ్యన్ వంటి యంగ్ ప్లేయర్లకూ అవకాశాన్ని కల్పించింది.
పాట్ కమ్మిన్స్ జట్టుకు కేప్టెన్. గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాను ఛాంపియన్గా నిలబెట్టాడు. అందుకే 20 కోట్ల రూపాయలను ధారబోసి మరీ అతన్ని జట్టులోకి తీసుకుది. కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది సన్రైజర్స్ ఫ్రాంఛైజీ. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మలిక్ వంటి టీ20 స్పెషలిస్టు పేసర్లు జట్టులో ఉన్నారు. వనిందు హసరంగ తొలి మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండట్లేదు.
దీనికి సమవుజ్జీగా ఉంది కోల్కత్ టీమ్. శ్రేయాస్ అయ్యర్.. జట్టులోకి రావడం కోల్కత నైట్ రైడర్స్కు అదనపు బలం. మిఛెల్ స్టార్క్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, ఆండీ రస్సెల్స్ వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల సమద్, వాషింగ్టన్ సుందర్, పాట్ కమ్మిన్స్ (కేప్టెన్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఆడే అవకాశాలు ఉన్నాయి.