Mayank Yadav: ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ చేసింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను మట్టికరిపించింది. 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి ఎగబాకింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్- 54, కేప్టెన్ నికొలస్ పూరన్- 42, కృనాల్ పాండ్యా- 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడారు. అనంతరం ఛేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 178 పరుగులే చేయగలిగింది.

ఓపెనర్లు శిఖర్ ధావన్- 70, జానీ బెయిర్స్టో- 42 పరుగులతో రాణించినప్పటికీ.. ఆ తరువాతి బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్ ఒక్కడే 28 పరుగులతో లక్నో బౌలర్లను కొంత వరకు ప్రతిఘటించగలిగాడు. ఆల్రౌండర్ సామ్ కుర్రన్ గోల్డెన్ డక్ రికార్డ్ చేశాడీ మ్యాచ్లో.
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త బౌలర్ మయాంక్ యాదవ్.. నాలుగు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మొహసిన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్తో కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ ఓవర్ నైట్ స్టార్డమ్ను సొంతం చేసుకున్నాడు. తొలి ఐపీఎల్లోనే మూడు వికెట్లు నేలకూల్చడం ఒక ఎత్తయితే, 145 కిలోమీటర్లకు పైగా వేగంతో మూడు ఓవర్లను సంధించడం మరో ఎత్తు.
21 సంవత్సరాల కుర్ర బౌలర్.. మూడు ఓవర్లు అంటే 18 బంతులను 145 కిలోమీటర్ల సగటు వేగంతో సంధించాడు. అందులో ఎనిమిది బంతులు 150 కిలోమీటర్లకు పైగా వేగాన్ని రికార్డ్ చేశాయి. అతను వేసిన ఓ డెలివరి 155.8 కిలోమీటర్లను టచ్ చేసింది. ఈ సీజన్లో ఇదే స్పీడ్ డెలివరి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు తొలి మ్యాచ్లోనే.
గత ఏడాదే ఐపీఎల్కు ఎంపికైనప్పటికీ గాయం వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు మయాంక్. ఈ సీజన్తో కమ్ బ్యాక్ అయ్యాడు. అదరగొట్టాడు. మయాంక్ యాదవ్ను అందరూ రాజధాని ఎక్స్ప్రెస్గా పిలుస్తారని చిన్నప్పటి కోచ్ వెల్లడించాడు.