లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్పై గెలిచి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. లక్నో వేదికగా ఆదివారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 163 పరుగులు చేసింది. స్టొయినిస్ (58; 43 బంతుల్లో, 4x4, 2x6) అర్ధశతకంతో రాణించాడు. కేఎల్ రాహుల్ (33; 31 బంతుల్లో, 3x4), నికోలస్ పూరన్ (32*; 22 బంతుల్లో, 3x6) పరుగులు చేశారు.
అనంతరం ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. యశ్ ఠాకూర్ (5/30) అయిదు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. కృనాల్ పాండ్య నాలుగు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ (31; 23 బంతుల్లో, 4x4), రాహుల్ తెవాతియా (30; 25 బంతుల్లో, 2x4, 2x6) టాప్ స్కోరర్లు.

మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓటమికి కారణాలు వివరించాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉందని, కానీ బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ను కోల్పోయామని గిల్ చెప్పాడు. తమ బౌలర్లుగా గొప్పగా ఆడారని కొనియాడాడు. భారీ స్కోరు చేయకుండా లక్నోను తక్కువ స్కోరుకే కట్టడిచేశామని, కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయామని తెలిపాడు.
''పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంది. కానీ మేం పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాం. మంచి ఆరంభాన్నే అందుకున్నాం. కానీ మధ్యలో క్రమంగా వికెట్లు కోల్పోయాం. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేకపోయాం. మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. లక్నోను 163 పరుగులకే కట్టడి చేశారు. కానీ బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది''
''డేవిడ్ మిల్లర్ జట్టులో లేకపోవడం ప్రతికూలతే. అతను కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడగలడు. ఇక నా వికెట్ విషయానికొస్తే.. పవర్ప్లేలో మరిన్ని పరుగులు సాధించాలని ట్రై చేసి ఔటయ్యా'' అని గిల్ పేర్కొన్నాడు. పవర్ప్లేలో గుజరాత్ 54 పరుగులు చేసింది. ఆరో ఓవర్ ఆఖరి బంతికి గిల్ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు.