ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు. ఈ క్రమంలో పంత్ అరుదైన రికార్డు సాధించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3000 పరుగుల మార్క్ను అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ చరిత్రకెక్కాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పంత్ 104 మ్యాచ్ల్లో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు. అంతేగాక ఐపీఎల్లో మూడు వేల పరుగులను అతి తక్కువ బంతుల్లో సాధించిన ప్లేయర్గా పంత్ (2028 బంతుల్లో) రికార్డులకెక్కాడు. కారు ప్రమాదానికి గురై దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైన పంత్ ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో పంత్ ఆకట్టుకుంటున్నాడు. ఆరు మ్యాచ్ల్లో 194 పరుగులు చేశాడు. దీనిలో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు.
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ''ఈ విజయం ఎంతో ఊరట ఇచ్చింది. ఛాంపియన్స్లా ఆలోచించి తీవ్రంగా ప్రయత్నించాలని జట్టు సభ్యులతో చెప్పాను. గతంలో బౌలింగ్ విషయంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కొందరు బాధ్యతల భారాన్ని మోస్తూ ముందుకు వచ్చారు. జట్టుగా కలిసి సాధించాం. ఇప్పుడు అసలైన తుదిజట్టును ఎంచుకున్నామని భావిస్తున్నాం. కానీ మా జట్టులో ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. దాని గురించి కంప్లైట్ చేయలేం. అయితే వన్డౌన్లో జేక్ ఫ్రేజర్ను కనుగొన్నాం. అలాగే షైహోప్ను జట్టులో కొనసాగిస్తాం'' అని పంత్ పేర్కొన్నాడు.