లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో నిలిచిన జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడు. ఢిల్లీ ఆధిపత్యానికి బ్రేక్లు వేస్తూ లక్నోను తిరిగి పోటీలోకి తెచ్చాడు. 94/7 స్కోరుతో ఉన్న లక్నో.. ఢిల్లీకి 168 రన్స్ టార్గెట్ ఇచ్చిందంటే ఆయుష్ పోరాటంతోనే.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో మూడో ఓవర్లోనే డికాక్ (19; 13 బంతుల్లో, 4x4) వికెట్ కోల్పోయింది. డికాక్ను, దేవదత్ పడిక్కల్ (3; 6 బంతుల్లో)ను ఖలీల్ అహ్మద్ స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేశాడు. అనంతరం బంతి అందుకున్న కుల్దీప్ లక్నోకు చుక్కలు చూపించాడు. తాను సంధించిన తొలి తొమ్మిది బంతుల్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. స్టొయినిస్ (8; 10 బంతుల్లో, 1x4), నికోలస్ పూరన్ (డకౌట్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6)ను వరుసగా ఔట్ చేశాడు.

వికెట్ల వేటలో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ కూడా చేరడంతో 14 ఓవర్లలో 94 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ఆయుష్ బదోని ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌండరీ, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయుష్కు అర్షద్ ఖాన్ (20*; 16 బంతుల్లో, 2x4) సహకరించాడు.
అయితే ఢిల్లీ బౌలర్లు మరోసారి డెత్ఓవర్లలో పరుగులను నియంత్రించలేకపోయారు. 18వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ 15 పరుగులు, 19వ ఓవర్లో ముకేశ్ కుమార్ 13 పరుగులు, 20వ ఓవర్లో ఇషాంత్ శర్మ 11 పరుగులు సమర్పించుకున్నారు. కాగా, కుల్దీప్ (3/20) మూడు, ఖలీల్ (2/41) రెండు వికెట్లు తీశారు.