ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం జస్ప్రీత్ బుమ్రా చేస్తున్న పనులే. ఐపీఎల్ మినీ వేలానికి ముందు తన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్పై బుమ్రాకు కోపం వచ్చినట్లు కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. ఇది బుమ్రాకు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ తర్వాత ముంబై జట్టు పగ్గాలు ఎవరికి దక్కుతాయని చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుమ్రా పేరు బయటకు వచ్చింది. అంతకుముందు ఈ అవకాశం హార్దిక్ పాండ్యాకు దక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ అతను గుజరాత్ టైటాన్స్కు వెళ్లిపోవడంతో.. ముంబై తర్వాతి కెప్టెన్ బుమ్రానే అని ఫ్యాన్స్ అనుకున్నారు.

ఇలాంటి సమయంలో మళ్లీ హార్దిక్ను తీసుకోవడంతో బుమ్రాకు ముంబై ఫ్రాంచైజీ హ్యాండిచ్చినట్లయింది. ఈ క్రమంలోనే అతను 'ఒక్కోసారి మౌనమే గొప్ప సమాధానం' అంటూ సోషల్ మీడియాలో క్రిప్టిక్ పోస్టు పెట్టాడు. దీనిపై మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ఇలా పాండ్యా రీఎంట్రీ ఇవ్వడం బుమ్రాకు నచ్చేలేదేమో? అని అన్నాడు.
'టెస్టులైనా, వైట్ బాల్ క్రికెట్ అయినా సరే.. బుమ్రా వంటి మరో ప్లేయర్ మరొకరు దొరకడు. తను బెస్ట్ ప్లేయర్లలో ఒకడు. వరల్డ్ కప్లో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఇంగ్లండ్తో గతేడాది జరిగిన ఐదో టెస్టులో అతనే తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు కూడా' అని గుర్తుచేశాడీ లెజెండరీ ఓపెనర్.
'ఇప్పుడు బుమ్రా బాధ పడుతూ ఉండొచ్చు. ఇది అతని ఈగో కూడా అయ్యుండొచ్చు. లేదంటే తను ముంబై కోసం ఎంతో చేస్తే.. టీం మాత్రం జట్టును వదిలేసి వెళ్లిన మరో ప్లేయర్ను తిరిగి తీసుకురావడం, అతను వస్తున్నాడని సంబరాలు చేసుకోవడం బుమ్రాకు నచ్చకపోవచ్చు. ఇది కరెక్ట్ కాదని అతనికి అనిపించడంలో తప్పేం లేదు' అని శ్రీకాంత్ వివరించాడు.