KL Rahul: ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవటం అనూహ్య వాతావరణం ఏర్పడటానికి దారి తీసింది. మ్యాచ్ ఓడిపోవడంతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది లక్నో. చేతిలో ఉన్న మిగిలిన మ్యాచ్లల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా ముగిసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన సన్రైజర్స్.. ఈ స్కోర్ను ఊది అవతలపడేసింది.

ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 9.4 ఓవర్లల్లో 167 పరుగులను పిండుకుంది. ఓవర్కు సుమారు 17.27 పరుగుల తేడాతో ఉరకలు పెట్టింది సన్రైజర్ప్ స్కోర్ బోర్డ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ 28 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు, ట్రావిస్ హెడ్ ఎనిమిది చొప్పున ఫొర్లు, సిక్సర్లు కొట్టాడు. వారిద్దరూ నాటౌట్గా నిలిచారు.
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఓడిపోయిన తరువాత దాని ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా.. కేప్టెన్ కేఎల్ రాహుల్తో బహిరంగంగా వాగ్వివాదానికి దిగిన సన్నివేశాలను మనం చూశాం. కేఎల్ రాహుల్పై సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి.
దీనితో- కేఎల్ రాహుల్ కేప్టెన్సీపై వేటు పడుతుందని భావించారంతా. మిగిలిన మ్యాచ్కు జట్టు సారథ్య బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారంటూ అభిప్రాయపడ్డారు. మార్కస్ స్టొయినిస్ సహా ఒకరిద్దరు అనుభవజ్ఞుల పేర్లను ఖరారు చేసిందనే ప్రచారం విస్తృతంగా సాగింది.
దీనిపై ఎట్టకేలకు మౌనం వీడింది లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ. జట్టు కేప్టెన్గా కేఎల్ రాహుల్ కొనసాగుతాడని తెలిపింది. అతనిపై వేటు వేయాలనే ఆలోచన కూడా లేదని వివరణ ఇచ్చింది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్కు అతనే కేప్టెన్గా ఉంటాడని స్పష్టం చేసింది. లక్నో చేతిలో ఉన్నవి రెండు మ్యాచ్లే కావడం వల్ల కేప్టెన్సీ మార్పుపై ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.