ఐపీఎల్-2024 షెడ్యూల్లో రెండు మ్యాచ్ల తేదీలు మారాయని బీసీసీఐ వెల్లడించింది. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 17న ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లు జరగాల్సి ఉంది.
కానీ కోల్కతా మ్యాచ్కు కావాల్సినంత భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)కు పోలీసులు తెలియజేశారు. దీంతో ఏప్రిల్ 16న జరగాల్సిన GT vs DC మ్యాచ్ను 17వ తేదీకి, అలాగే ఏప్రిల్ 17న నిర్వహించాల్సిన KKR vs RR మ్యాచ్ను 16వ తేదీకి మార్చారు. తేదీల్లో మాత్రమే మార్పులు చోటు చేసుకున్నాయని, వేదికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

రీషెడ్యూల్ తర్వాత మ్యాచ్లు
ఏప్రిల్ 16- కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా)
ఏప్రిల్ 17- గుజరాత్ వర్సెస్ ఢిల్లీ (మోడీ స్టేడియం, అహ్మదాబాద్)
మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 17వ సీజన్ మే 26న ముగుస్తుంది. మే 19తో లీగ్ స్టేజ్ మ్యాచ్లు పూర్తికానున్నాయి. మే 21వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మే 21న క్వాలిఫయిర్-1 జరగుంది. ఆ మరుసటి రోజు అదే వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. చెపాక్ వేదికగా మే 24న క్వాలిఫయిర్-2, అలాగే మే 26న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కాగా, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. కేకేఆర్ ఆడిన రెండింట్లో గెలిచింది. అయితే ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. బెంగళూరు మూడు మ్యాచ్ల్లో, లక్నో రెండు మ్యాచ్ల్లో ఓ విజయం సాధించాయి.