Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. కోల్కత నైట్రైడర్స్పై ఓడిపోయింది. ఆ జట్టుకు ఇది వరుసగా ఆరో ఓటమి. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లల్లో ఆర్సీబీ గెలిచింది ఒక్కటే. ఈ వరుస ఓటముల తరువాత ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టయింది.
ఆదివారం మధ్యాహ్నం కోల్కత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్కు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను ఛేదించడానికి చిట్టచివరి వరకూ పోరాడింది ఆర్సీబీ. 20 ఓవర్లల్లో 221 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రారంభ ఓవర్లల్లో ధాటిగా ఆడింది ఆర్సీబీ. ఓపెనర్ విరాట్ కోహ్లీ తొలి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కోహ్లీ రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్తో 18 పరుగులు చేశాడు. టాప్ గేర్లో కొనసాగుతున్న సమయంలో వివాదాస్పద డెలివరీకి బలి అయ్యాడు.
హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కాట్ అండ్ బౌల్ అయ్యాడు కోహ్లీ. నడుం కంటే ఎత్తులో దూసుకొచ్చిన ఫుల్ టాస్ డెలివరీ అది. దాన్నిసరిగ్గా అంచనా వేయలేకపోయాడు కోహ్లీ. ఆ బంతిని ఎదుర్కొనడానికి బ్యాట్ను అడ్డు పెట్టాడు. బ్యాట్ పైఅంచుకు తగిలిన ఆ బంతిని హర్షిత్ రాణా అలవోకగా అందుకున్నాడు.
నడుం కంటే ఎత్తులో బౌలర్ సంధించిన డెలివరీని నో బాల్గా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ బంతికి అంపైర్ అవుట్ ఇవ్వడంతో కోహ్లీ రివ్యూ సైతం తీసుకున్నాడు గానీ అది సక్సెస్ కాలేదు. అందులోనూ అవుట్గా తేలింది. క్రీజ్ నుంచి కోహ్లీ బయట ఉండటం వల్లే అవుట్ ఇవ్వాల్సి వచ్చిందంటూ చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.
దీనిపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. అది నో బాల్ అని తేల్చేశాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన బంతిని తాను అబ్జర్వ్ చేశానని, అతను అవుట్ కాలేదని పేర్కొన్నాడు. బంతి నడుం కంటే ఎత్తులో వెళ్లిందని, నో బాల్కు కోహ్లీ అవుట్ అయ్యాడని వ్యాఖ్యానించాడు.