Klaasen: ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్లు కూడా దుమ్ము లేపాయి. ఒకదాన్ని మించి మరొకటి అనే రేంజ్లో సాగాయవి. ఈ రెండూ కూడా ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాయి. సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ధ్వేషించే వారితో కూడా జైకొట్టించాయి.
తొలి మ్యాచ్లో కోల్కత నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. చివరి బంతి వరకూ పోరాడింది ఆరెంజ్ ఆర్మీ. ఆ జట్టు పోరాట స్ఫూర్తికి అద్దం పట్టింది. నైట్ రైడర్స్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. మడమ తిప్పలేదు. జట్టు స్కోరును 204 పరుగుల వరకూ తీసుకెళ్లారు బ్యాటర్లు. ఒక దశలో గెలిచే స్థితిలో కనిపించారు కూడా. చివర్లో క్లాసెన్ అవుట్ కావడం మలుపు తిప్పింది. మ్యాచ్ను చేజార్చింది.

ముంబై ఇండియన్స్పై జరిగిన రెండో మ్యాచ్లో సన్రైజర్స్.. ఏ స్థాయిలో రైజ్ అయ్యారో చెప్పనక్కర్లేదు. తమ సహజ స్వభావానికి విరుద్ధంగా ఆడిన గేమ్ ఇది. అత్యంత బలమైన ప్రత్యర్థి బౌలింగ్ను తుక్కు తుక్కు చేశారు. ఐపీఎల్లో గానీ టీ20 ఫార్మట్లో గానీ అసాధ్యం అనుకునే స్కోరున బాదారు. 120 బంతుల్లో 277 పరుగులు చేశారు బ్యాటర్లు.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మినహా క్రీజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బ్యాట్కు పని చేప్పారు. బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నారు. ట్రవిస్ హెడ్- 62, అభిషేక్ శర్మ- 63, ఎయిడెన్ మార్క్రమ్- 42.. చేసిన స్కోర్ ఒక ఎత్తయితే హెన్రిచ్ క్లాసెన్ ఆడిన సునామీ ఇన్నింగ్ మరో ఎత్తు. 34 బంతుల్లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు 200లకు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేయడం మామూలు విషయం కాదు.
ఈ మ్యాచ్ తరువాత సన్రైజర్స్ ఫ్యాన్ బేస్ అమాంతంగా పెరిగింది. తెలుగు అభిమానులు ఈ జట్టుకు బ్రహ్మరథం పడుతున్నారు. స్వదేశీ, విదేశీ ప్లేయర్ అనే తేడా చూపట్లేదు. హోల్ టీమ్నూ ఓన్ చేసుకున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. నేటివిటీకి తగ్గట్టుగా ప్లేయర్లకు పేర్లను పెట్టారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్..సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మంచిర్యాల మయాంక్, హన్మకొండ హెడ్, తెలంగాణ త్రిపాఠి, మెదక్ మార్క్రమ్, ఖమ్మం క్లాసెన్, సంగారెడ్డి సమద్, చెర్లపల్లి కమ్మిన్స్, సూర్యాపేట్ సుందర్, భద్రాద్రి భువి, నిర్మల్ నటరాజన్, మహబూబ్నగర్ మయాంక్ మార్కండే, ఆదిలాబాద్ అభిషేక్.. అని పేర్లు పెట్టిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.