రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ శతక ఇన్నింగ్స్ స్ట్రైక్ రేటుపై చర్చ మొదలైంది. 67 బంతుల్లో సెంచరీని సాధించిన కోహ్లి తన ఇన్నింగ్స్ను 72 బంతుల్లో 113 పరుగులతో ముగించాడు. 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 156 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేశాడు.
టీ20 ఫార్మాట్లో ఇది చాలా స్లో ఇన్నింగ్స్ అని కొందరు నెటిజన్లు కోహ్లిని విమర్శించారు. మరోవైపు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోయినా కోహ్లి గొప్పగానే బ్యాటింగ్ చేశాడని మాజీ క్రికెటర్లు సమర్థించారు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ అంతగా బ్యాటింగ్ కూడా సహకరించలేదని వివరించారు.

కానీ పాకిస్థాన్ బౌలర్ జునైద్ ఖాన్ కోహ్లిని ట్రోల్ చేశాడు. ఐపీఎల్ స్లో సెంచరీ సాధించిన కోహ్లికి కంగ్రాట్స్ అంటూ నోరుజారాడు. దీంతో జునైద్ ఖాన్పై విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్పై కనీస జ్ఞానం లేకుండా ట్వీట్ చేశాడని, పిచ్, ఇతర బ్యాటర్ల సహకారాన్ని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి ఇన్నింగ్స్ విలువ తెలిసేదని కామెంట్లు పెట్టారు.
కాగా, ఐపీఎల్లో స్లోయెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా మనీష్ పాండే సరసన కోహ్లి నిలిచాడు. 2009 ఆర్సీబీ తరఫున మనీష్ పాండే డెక్కన్ ఛార్జర్స్పై 67 బంతుల్లో శతకం బాదాడు. రాజస్థాన్ రాయల్స్పై కోహ్లి కూడా ఇవాళ 67 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. వీరిద్దరు ఆర్సీబీ తరఫునే సాధించడం గమనార్హం. ఐపీఎల్లో నెమ్మదిగా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మనీష్ పాండే (67), విరాట్ కోహ్లి (67), సచిన్ టెండూల్కర్ (66), డేవిడ్ వార్నర్ (66), బట్లర్ (66) టాప్-5లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైపుర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113*; 72 బంతుల్లో, 12x4, 4x6) అజేయ సెంచరీ సాధించాడు. మరోసారి జట్టును ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బట్లర్ (100*; 58 బంతుల్లో, 9x4, 4x6) శతకంతో సత్తాచాటాడు. సిక్సర్తో జట్టును గెలిపించి సెంచరీని అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో, 8x4, 2x6) అర్ధశతకంతో అలరించాడు.