ఐపీఎల్-2024 సీజన్లో చెపాక్ వేదికగా మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూడాలనుకున్న సీఎస్కే అభిమానుల కల నిన్న నెరవేరింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ ఆఖర్లో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఈ సీజన్లో అంతకుముందు చెపాక్ వేదికగా రెండు మ్యాచ్లు జరిగినప్పటికీ ధోనీ బ్యాటింగ్కు రాలేదు. బెస్ట్ ఫినిషర్ రాకుండానే సీఎస్కే బ్యాటర్లు పనిని ముగించారు.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల్లో మాత్రం ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. ఎస్ఆర్హెచ్ పోరులో రెండు బంతుల్ని ఎదుర్కొన్న ధోనీ వైజాగ్ మ్యాచ్లో ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అందించాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. దీంతో హోమ్గ్రౌండ్లోనూ ధోనీ బ్యాటింగ్కు రావాలని సీఎస్కే అభిమానులు ఆశించారు.

దానికి తగ్గట్లుగానే ఫ్యాన్స్ కోసం కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో ధోనీ బరిలోకి దిగాడు. కానీ తక్కువ బంతులు ఆడే అవకాశమే వచ్చింది. మూడు బంతులు ఎదుర్కొన్న మహీ అజేయంగా ఒక్క పరుగు సాధించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అయితే ధోనీ బ్యాటింగ్కు వచ్చే సమయంలో గ్రౌండ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివమ్ దూబె ఔటవ్వడంతో తర్వాత బ్యాటింగ్ ఎవరు వస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది. అప్పటికీ చెన్నై విజయానికి కావాల్సన పరుగులు మూడు మాత్రమే. ఫ్యాన్స్ అందరూ ధోనీ రావాలని కోరుకున్నారు.
కానీ జడేజా బ్యాటింగ్కు సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెల్మెట్, గ్లవ్స్తో మైదానంలో అడుగుపెట్టడానికి దగ్గరగా వచ్చాడు. స్టేడియమంతా సైలెంట్ అయ్యింది. కానీ సడెన్గా జడేజా తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత క్షణంలో ధోనీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. ధోనీ ఎంట్రీకి తగ్గట్లుగా జైలర్ మూవీ టైటిల్ సాంగ్ ప్లే అవ్వడంతో మైదానం అరుపులు, విజిల్స్తో మార్మోగింది.
అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం జడేజా అలా ఎందుకు చేశాడనే విషయాన్ని సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్పాండే వివరించాడు. జడేజాను అలాచేయమని ధోనీనే సూచించాడని చెప్పాడు. 'బ్యాటింగ్కు నేను వెళ్తాను, కానీ నువ్వు బ్యాటింగ్కు వెళ్తున్నట్లు యాక్టింగ్ చేయి' అని జడేజాతో ధోనీ చెప్పాడని తుషార్ పేర్కొన్నాడు. దానికి జడేజా స్పందిస్తూ.. ధోనీ బ్యాటింగ్ చూడటం అభిమానులకు ఎంతో విలువైనదని అన్నాడు. కాగా, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.