దేశంలో క్రికెట్ పండగ మొదలైంది. శుక్రవారం నుంచి ఐపీఎల్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అదిరే ఆరంభ వేడుకలతో పాటు తొలి పోరు అభిమానులను అలరించింది. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సాగకపోయినా థ్రిల్లింగ్ కిక్ను మాత్రం ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.
అయితే ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి సంభాషణ వైరల్గా మారింది. జడేజా బౌలింగ్ చేస్తుండగా కోహ్లి చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నాలుగు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. అయిదో ఓవర్ తర్వాత బెంగళూరు కథ మారిపోయింది. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు చేజార్చుకుంది.

దూకుడు మీద ఉన్న డుప్లెసిస్ (35; 23 బంతుల్లో)ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో రజత్ పటిదార్ (0; 3 బంతుల్లో) డకౌట్ చేశాడు. తర్వాతి ఓవర్లో మాక్స్వెల్ను ఖాతా తెరవకముందే చాహర్ పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (18; 22 బంతుల్లో)తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.
అయితే గ్రీన్ను జడేజా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. కట్టుదిట్టమైన బంతులతోనే కాకుండ వెంటవెంటనే బౌలింగ్ చేస్తూ గ్రీన్ను కుదురుకోనివ్వలేదు. దీంతో నాన్స్ట్రైకర్లో ఉన్న కోహ్లి.. బౌలింగ్ చేస్తున్న జడేజాతో సరదా వ్యాఖ్యలు చేశాడు. ''అరె.. అతడ్ని కాస్త ఊపిరి తీసుకోనివ్వు'' అని కోహ్లి అన్నాడు. 11వ ఓవర్లో జరిగిన ఈ ఫన్నీ సంభాషణ నెట్టింట్లో వైరల్గా మారింది.
కాగా, చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అనుజ్ రావత్ (48; 25 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (38*; 26 బంతుల్లో) సత్తాచాటరు. ముస్తాఫిజుర్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం ఛేదనలో చెన్నై 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సీఎస్కేకు శుభారంభం దక్కింది. రచిన్ రవీంద్ర (37; 15 బంతుల్లో) దూకుడుతో పవర్ప్లేలో సీఎస్కే 62 పరుగులు చేసింది. కానీ స్వల్పవ్యవధిలోనే వికెట్లు కోల్పోవడం, శివమ్ దూబె (34*; 28 బంతుల్లో) తొలుత నిదానంగా ఆడటంతో మ్యాచ్ ఆర్సీబీ వైపుకు మళ్లింది. కానీ దూబె గేర్ మార్చి జడేజా (25; 17 బంతుల్లో)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.