బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో) టాప్ స్కోరర్. సిరాజ్, మాక్స్వెల్ రెండు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఆర్సీబీ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (77; 49 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. 11 బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (28*; 10 బంతుల్లో), మహిపాల్ లోమ్రర్ (17*; 8 బంతుల్లో) దూకుడుగా ఆడి జట్టును గెలిపించారు.

విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లి మాట్లాడాడు. ప్రజలంతా రికార్డులు, గణాంకాలు గురించి మాట్లాడుతుంటారని, కానీ వాటి కంటే జ్ణాపకాలే ముఖ్యమని అన్నాడు. గత రెండు నెలలు భారత్లో లేనని, తనని, తన ఫ్యామిలీని గుర్తుపట్టని ప్రాంతంలో సమయాన్ని గడిపామని కోహ్లి తెలిపాడు.
''చిన్నస్వామిలో అభిమానుల మధ్య కలిసి ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నాను. అయితే ఆటలో సాధించిన ఘనతలు, గణాంకాలు, నంబర్లు, రికార్డులు గురించి ప్రజలు మాట్లాడుతుంటారు. కానీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే కనిపించేవి జ్ణాపకాలే. రాహుల్ ద్రవిడ్ ఇదే చెబుతుంటాడు. ఆడే సమయంలో ప్రాణం పెట్టి ఆడాలి, ఈ క్షణాన్ని మళ్లీ పొందలేం. అందరి నుంచి ప్రేమ, ప్రశంసలు, మద్దతు అందుకోవడం అద్భుతంగా ఉంది''
''ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జట్టుకు అదిరే ఆరంభం ఇవ్వాలనుకున్నా. కానీ వికెట్లు పడుతుంటే పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ఆడాలి. ఇది సాధారణ పిచ్లా లేదు. కాస్త భిన్నంగా ఉంది. సరైన క్రికెటింగ్ షాట్లు ఆడాలని భావించా. అయితే మ్యాచ్ను ముగించిలేకపోవడం ఎంతో బాధించింది. డీప్ పాయింట్ మీదుగా షాట్ ఆడాలనుకున్నా. కానీ ఫలితం మరోలా వచ్చింది. నేను కవర్ డ్రైవ్ బాగా ఆడతాని వాళ్లకి తెలుసు. కానీ వాళ్లు నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ఫీల్డింగ్ మోహరించారు. కగిసో రబాడ, అర్షదీప్ సింగ్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసినప్పుడు బంతి గమనాన్ని, బౌన్స్ను అంచనా వేసి కాస్త ముందుగా షాట్ ఆడాలి''
''రెండు నెలలు ఆటకు దూరమైనా మంచి ఆరంభాన్నే పొందాను. ఆ విరామ సమయంలో మేం భారత్లో ఉండలేదు. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రాంతంలో ఉన్నాం. కుటుంబంతో కలిసి సాధారణంగా సమయాన్ని గడిపాం. ఆ అనుభవం అవాస్తవంగా అనిపించింది. ఇక కుటుంబ పరంగా ఇద్దరు పిల్లలని కలిగి ఉండటం సంతోషకరమై విషయం'' అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో కోహ్లి సతీమణి అనుష్క అకాయ్ కోహ్లికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి రెండు నెలల పాటు క్రికెట్కు దూరమయ్యాడు.