ఐపీఎల్-2024 సీజన్కు కొత్త కెప్టెన్ను నియమించినట్లు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్లో ఎస్ఆర్హెచ్ను ప్యాట్ కమిన్స్ నడిపించనున్నాడు. సన్రైజర్స్ కెప్టెన్గా కమిన్స్ బాధ్యతలు అందుకుంటాడని గత మూడు నెలలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత రోజు నుంచి కథనాలు మొదలయ్యాయి.
బౌలింగ్, బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలు సమర్థవంతంగా నిర్వహించే కమిన్స్ కోసం ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్లో తీవ్రంగా పోటీపడింది. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఇతర జట్లు పోటీగా వచ్చినా అంతిమంగా రికార్డు ధరతో అతడ్ని సన్రైజర్స్ సొంతం చేసుకుంది. కమిన్స్ కోసం ఏకంగా రూ.20.50 కోట్లు కుమ్మరించింది.

గతేడాది కమిన్స్ పట్టిందల్లా బంగారంలా మారింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్లను గెలిచిన కెప్టెన్గా కమిన్స్ నిలిచాడు. ఆ రెండు ఫైనల్లోనూ భారత్పైనే ఆస్ట్రేలియా విజయం సాధించడం గమనార్హం. అంతేగాక కెప్టెన్గా యాషెస్ సిరీస్ను కాపాడుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023గా, ఐసీసీ టెస్టు జట్టు సారథిగా కమిన్స్ ఎంపికయ్యాడు.
అయితే ఈ కారణాలతో పాటు మరో ప్రత్యేక సెంటిమెంట్తో కమిన్స్ను సన్రైజర్స్ కెప్టెన్గా నియమించిందని నెట్టింట్లో చర్చ మొదలైంది. హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఇప్పటివరకు రెండు టైటిళ్లు దక్కాయి. 2009లో డెక్కన్ ఛార్జర్స్గా, 2016లో సన్రైజర్స్గా హైదరాబాద్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లే. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ జట్టును నడిపించారు.
కాగా, అదే మ్యాజిక్ను ఇప్పుడు రిపీట్ చేయాలనే సెంటిమెంట్తోనూ ఆస్ట్రేలియా ప్లేయర్ సారథి బాధ్యతలు కట్టబెట్టారని నెటిజన్లు కొత్త వాదాన్ని తెరతీశారు. మరోవైపు కారణాలు ఏమైనప్పటికీ కమిన్స్ ఉత్తమ సారథి అని ఎస్ఆర్హెచ్ నిర్ణయానికి కొందరు మద్దతు ఇస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.