టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయాలతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2023లో గాయపడిన రాహుల్ గతేడాది ఆసియా కప్లో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ ఆడాడు.
అనంతరం ఉప్పల్ టెస్టులో మరోసారి గాయపడ్డాడు. అయినప్పటికీ ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు ఎంపికయ్యాడు. 90 శాతం ఫిట్గా ఉన్నాడని, భారత జట్టుతో చేరతాడని బీసీసీఐ పేర్కొంది. కానీ కట్ చేస్తే.. ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 'రాహుల్ను బీసీసీఐ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తుంది. లండన్ వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తోంది. ధర్మశాల టెస్టుకు అతడు దూరమయ్యాడు' అని బీసీసీఐ రాహుల్ గురించి ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

దీంతో రాహుల్ భవితవ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా వరుసగా గాయాలపాలవుతున్న రాహుల్ ఇప్పటికీ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవల అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ రాహుల్కు అవకాశం దక్కలేదు. 2022 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లోనే చివరిగా భారత్ తరఫున టీ20 ఆడాడు.
ఈ నేపథ్యంలో జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో జట్టులో రాహుల్ చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేస్తేనే వరల్డ్ కప్లో భారత జట్టులో చోటు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇదే సమయంలో రాహుల్ గాయపడటం అతడికి మరింత ప్రతికూలంగా మారింది. అయితే రాహుల్ గాయంపై, అతని భవిష్యత్పై బీసీసీఐ వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి.
''లండన్లో అత్యుత్తమ వైద్యనిపుణలతో కేఎల్ రాహుల్ చికిత్స తీసుకుంటున్నాడు. ఆదివారం తిరిగి భారత్కు చేరుకుంటాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బెంగళూరులో పూర్తిగా కోలుకుంటాడు. అతిత్వరలో ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందుతాడు. ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడు. అంతేగాక టీ20 ప్రపంచకప్కు రాహుల్ వికెట్కీపర్-బ్యాటర్లా ఎంపికయ్యేలా టీమిండియా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు'' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.