ఐపీఎల్-2024ను లక్నో సూపర్ జెయింట్స్ విజయంతో ముగించింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో 18 పరుగుల తేడాతో నెగ్గింది. 14 మ్యాచ్ల్లో ఏడింట్లో గెలిచి 14 పాయింట్లు సాధించింది. సీఎస్కేతో సమానమైన పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేటు కారణంగా ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో, 5x4, 8x6), కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో, 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. నువాన్ తుషారా (3/28), పీయూష్ చావ్లా (3/29) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో, 10x4, 3x6), నమన్ ధిర్ (62*; 28 బంతుల్లో, 4x4, 5x6) పోరాడారు. రవి బిష్ణోయ్ (2/37), నవీనుల్ (2/50) తలో రెండు వికెట్లు తీశారు.

విజయానంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోవడం నిరాశ కలిగిస్తుందని అన్నాడు. ''సీజన్ ప్రారంభంలో మా జట్టు ఎంతో బలమైనది, అన్ని విభాగాల్లో పటిష్టమైనదిగా భావించాను. కానీ జట్టులో ఆటగాళ్లకు గాయాలయ్యాయి. ఇది ప్రతి టీమ్కు జరుగుతుంటుంది. సమష్టిగా మేం సత్తాచాటలేకపోయాం. ఇవాళ మ్యాచ్లో చేసిన ప్రదర్శన మరిన్ని మ్యాచ్ల్లోనూ చేయాల్సింది. కానీ దురుదృష్టవశాత్తు చేయలేకపోయాం''
''జట్టులోని భారత పేసర్ల కోసం మా ఫ్రాంచైజీ ఎంతో పెట్టుబడి పెట్టింది. ఇది కేవలం రెండు నెలలు మాత్రమే కాదు, ఏడాది మొత్తానికి ఖర్చు చేసింది. మోర్నె మోర్కెల్ దగ్గర శిక్షణ కోసం మయాంక్ యాదవ్, యుద్విర్ సింగ్లను దక్షిణాఫ్రికా పంపించాం. వాళ్ల కష్టం ఫలించింది. నికోలస్ పూరన్ గొప్పగా ఆడాడు. మా అంతర్జాతీయ సీనియర్ ఆటగాళ్లు తమ స్థానాల్లో ఆడుతూ ఒత్తిడి జయించాలని అనుకున్నాం.
''ఈ సీజన్లో నా బ్యాటింగ్ గురించి ఎంతో నేర్చుకున్నాను. ముందు రోజుల్లో టీ20 ఫార్మాట్ మ్యాచ్లు తక్కువగా ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకోవాలి. మిడిలార్డర్ లేదా ఇతర స్థానంలోనా అని తెలియదు. ఇక ఇప్పుడు మా మామ టీమ్కు వచ్చాను. ఆయనతో కలిసి వరల్డ్ కప్లో 'శర్మ జీ కా బేటా'కి సపోర్ట్ చేస్తాను'' అని కేఎల్ రాహుల్ అన్నాడు. తన మామ సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓ యాడ్ షూట్ చేశాడు. దీనిలో రాహుల్ కాదని, రోహిత్కు సునీల్ శెట్టి సపోర్ట్ చేస్తాడు. దాని గురించి రాహుల్ ఇలా ఫన్నీగా ప్రస్తావిస్తూ ప్రపంచకప్లో భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.